iDreamPost
android-app
ios-app

“JC” దురుసుత‌నం ఫ‌లితం…

“JC” దురుసుత‌నం ఫ‌లితం…

నోరు మంచిదైతే.. ఊరు మంచిద‌వుతాది అంటారు. నోరు అదుపుత‌ప్పితే.. క‌ష్టాలు కొనితెచ్చుకున్న‌ట్లే అని కూడా చెబుతారు. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విష‌యంలో రెండోదే జ‌రిగింది. దురుసుత‌నంతో వ్య‌వ‌హ‌రించి కేసుల్లో ఇరుక్కున్నారు. అటు మైనింగ్ కేసు.. ఇటు పోలీసుల‌ను దూషించిన కేసు.. ఇలా ప‌లు సెక్ష‌న్ల‌లో ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. పోలీసులను దూషించిన ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అధికారుల అంతు చూస్తానంటూ.. మా వాళ్లు మీ ర‌క్తం తాగుతారంటూ జేసీ దివాకర్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో శుక్ర‌వారం బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేర‌కు తాడిపత్రి సీఐ తేజోమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.


మైనింగ్ సంస్థలకు నోటీసులు

ఇదిలా ఉండ‌గా.. జేసీకి చెందిన మైనింగ్ సంస్థ‌ల్లో అధికారులు అక్రమాలు గుర్తించారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ముచ్చుకోటలో రెండు డోలమైట్ మైనింగ్ క్వారీలను జేసీ దివాకర్‌ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ రమణారావు తెలిపారు. సుమన, భ్రమరాంబ సంస్థల పేరుతో మైనింగ్ నిర్వహిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి కార్మికుల భద్రతను గాలికొదిలేశారని ఆయన పేర్కొన్నారు. మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో మైనింగ్ పనులు జరగడం లేదని, నిబంధనలు పాటించని మైనింగ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు క్వారీల్లో ఉల్లంఘన జరిగిందని, ఉన్నతాధికారులకు నివేదిక పంపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వీ రమణారావు స్పష్టం చేశారు.

గ‌తంలో లీజులు ర‌ద్దు

గతంలో యాడికిలోని దివాకర్‌రెడ్డికి సంబంధించిన త్రిశూల్‌ సిమెంట్‌ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని.. సున్నపు రాతి గనుల లీజుల్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల గడువు పొడిగిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని లీజు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 38,212 మెట్రిక్ టన్నుల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి తీయడం, రవాణా చేయడంపై విచారణ చేపడుతామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.