iDreamPost
android-app
ios-app

పోలవరం నిర్మాణంపై సీఎం స్పష్టత, ఇకనైనా ఆగుతుందా ఆ ప్రచారం?

  • Published Mar 02, 2021 | 2:14 AM Updated Updated Mar 02, 2021 | 2:14 AM
పోలవరం నిర్మాణంపై సీఎం స్పష్టత, ఇకనైనా ఆగుతుందా ఆ ప్రచారం?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టతనిచ్చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులపై ఆయన సూటిగా స్పందించారు. ఇటీవల కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలకు ఆయన చెక్ పెట్టారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ప్రతిపాదనల చుట్టూ రాస్తున్న రాతలను ఆయన తోసిపుచ్చారు. పోలవరం ఎత్తు తగ్గింపు సాధ్యం కాదంటూ చెప్పేశారు. దాంతో పలు రకాల ఊహాగానాలు, అనేక అనుమానాలకు తావిచ్చేలా ఓ సెక్షన్ మీడియా చేస్తున్న ప్రయత్నాలకు, వాస్తవానికి పొంతన లేదని తేలిపోయింది.

పోలవరం నిర్మాణంలో గత ప్రభుత్వ తప్పిదాలవల్ల పనులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని పలువురు అధికారులు సీఎం ముందు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. స్పిల్‌ వే పూర్తికాకుండా.. కాఫర్‌ డ్యాం నిర్మాణం వల్ల ఇబ్బందులు వచ్చాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఒక పద్ధతి ప్రకారం కాకుండా.. అక్కడక్కడా అరకొరగా పనులు చేసి వదిలిపెట్టారంటూ చర్చ జరిగింది.

Also Read:పోలవరం ఎత్తు మీద ఎందుకీ ఎత్తుగడలు?

గతంలో కాఫర్‌ డ్యాంలో ఉంచిన ఖాళీల కారణంగా వరదల సమయంలో సెకనుకు సుమారు 13 మీటర్లు వేగంతో వరద ప్రవాహం వచ్చిందని అధికారులు వివరించారు. దీనివల్ల ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం వద్ద గ్యాప్‌ 1, గ్యాప్‌ 2 లలో భారీ ఎత్తున కోతకు గురైందని సీఎం సమీక్షలో పేర్కొన్నరు. దాని మూలంగా వరదల సమయంలో స్పిల్‌ఛానల్‌ పనులకూ తీవ్ర ఆటంకం ఏర్పడిందన్న అధికారులు.. ఇప్పుడా సమస్యలన్నీ అధిగమించేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని సీఎంకు వివరించారు.

స్పిల్‌వే పనులు పూర్తయ్యాయని సమావేశంలో నిర్ధారించారు. గేట్లు, సిలిండర్ల బిగింపు చురుగ్గా సాగుతోందని స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ఛానల్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. అవి పూర్తయ్యేలోగా కాఫర్‌ డ్యాంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని అన్నారు. వచ్చే వరదనీటిని స్పిల్‌ వే మీదుగా పంపే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. మే నెలాఖరు నాటికి కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేస్తామని, సహాయపునరావాస కార్యక్రమాలపైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశఙంచారు.

Also Read:పోలవరం-పరుగులు !

పోలవరం ఎత్తు తగ్గింపుపై పత్రికల్లో వచ్చిన కథనాలు, ఆ కథనాలను పట్టుకుని చేస్తున్న దుష్ప్రచారంపై సమావేశంలో చర్చకు వచ్చింది. ఇప్పుడున్న స్థితిలో అసలు అలాంటి అవకాశమే లేదని అధికారులు స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ (సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఎత్తు తగ్గింపుపై ఇప్పుడు చర్చలు, ప్రతిపాదనలు అసంబద్ధమంటూ సెంట్రల్‌ వాటర్‌కమిషన్, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ విస్పష్టంగా చెప్పాయన్న అధికారులుఇప్పటికే నిర్దేశిత ఎత్తుకు తగిన విధంగా షట్టర్లు బిగింపు పూర్తవుతోందని తెలిపారు. నదుల అనుసంధానంపై రాష్ట్రం తరఫునుంచి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులకు సీఎం సూచించారు.నదుల అనుసంధానం వల్ల ఇక్కడ ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపాదనలు ఉండాలని సీఎం సూచించారు.

పోలవరం వద్ద వైయస్సార్‌ గార్డెన్స్‌ నిర్మాణం పనులపైనా సీఎం సమీక్షించారు. పోలవరం వద్ద జి– హిల్‌సైట్‌పై 100 అడుగుల ఎత్తుతో నిర్మించనున్న వైయస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మాణం, ఈ బ్రిడ్జి నుంచి జి– హిల్‌ను అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణంపై అధికారులు ప్రతిపాదించగా, సీఎం అంగీకరించారు. దాంతో పోలవరం ఎత్తు విషయంలో సాగుతున్న దుష్ప్రచారం విషయంలో సీఎం క్లారిటీ ఇవ్వడంతో ఇక అలాంటి అర్థ సత్య కథనాలకు చెక్ పడినట్టేనని భావించవచ్చు