రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, అంధ్రప్రదేశ్లో కన్నా తాలిబన్ల పాలన మెరుగని వ్యాఖ్యలు చేసే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్సీఆర్బీ నివేదికను చూస్తే ఏమంటారో? నేరాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు మెరుగ్గా ఉందని జాతీయ క్రైమ్ రికార్డ్సు బ్యూరో తన వార్షిక నివేదికలో విస్పష్టంగా పేర్కొంది. దేశవ్యాప్తంగా నేరాలకు సంబంధించి నమోదైన కేసుల గణాంకాలను క్రోడీకరించి ఎన్ సీఆర్బీ ఈ నివేదికను రూపొందించింది. హత్యలు, అత్యాచారాలు, అత్యాచార యత్నాలు, మహిళలపై ఇతర రకాల వేదింపులు, దోపిడీలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు వంటివి గణనీయంగా తగ్గాయని గణాంకాలతో వివరించింది.
ఫిర్యాదులపై స్పందన భేష్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులపై సత్వరం స్పందించే తీరు బావుందని ప్రశంసించింది. 2019తో పోలిస్తే 2020లో నేరాలు 15 శాతం తగ్గాయని, 2018తో పోలిస్తే 20 శాతానికి పైగా తగ్గాయని పేర్కొంది. దిశ యాప్, స్పందన, పోలీస్ సేవాయాప్, సైబర్ మిత్ర వాట్సాప్, డయల్ 112, డయల్ 100 విభాగాల ద్వారా వచ్చిన 2,10,025 ఫిర్యాదులపై 6,123 ఎఫ్ఐఆర్ లు నమోదయినట్టు తెలిపింది. వీటిలో నేర స్వభావం ఉన్నకేసులు తక్కువని నిర్థారించిం ది. అలాగే దొంగతనాలు, చోరీలు వంటి ఆర్థిక నేరాలు కూడా బాగా తగ్గాయని స్పష్టం చేసింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి ఇసుక, మద్యం. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో మెరుగైన పనితీరు కనబరిచిం దని మెచ్చుకుంది. ఈ అక్రమ దందాలపై ప్రభుత్వం ఉక్కుపాదము మోపుతోంది అనడానికి నాన్ కాగినిజిబుల్ కేసులు పెరగడమే తార్కాణమని తెలిపింది.
Also Read : ఎల్జీ పాలిమర్స్పై కేబినెట్ కీలక నిర్ణయం
భద్రత దిశగా కీలక నిర్ణయాలు
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఫ్రెండ్లీ పొలీసింగు, గ్రామ/వార్డు సచివాలయాలల్లో మహిళా పోలీసుల ఏర్పాటు, పోలీసులకు వీక్లీ ఆఫ్ వంటివి సత్ఫలితాలిస్తున్నాయి. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దిశ గస్తీ కోసం రూ.16.60 కోట్లతో 145 మహింద్రా స్కార్పియో వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దిశ ల్యాబ్లను ఏర్పాటు చేసి 58 ఫోరెన్సిక్ నిపుణుల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీసు స్టేషన్లలో హెల్ప్ డెస్క్ లు, సైబర్ మిత్ర, పోలీసు సేవా యాప్ తో వేదింపుల కట్టడి వంటి చర్యలు మహిళల రక్షణకు పూర్తి భరోసా ఇస్తున్నాయి.
మహిళల్లో చైతన్యం..
ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు మహిళల్లో చైతన్యం తీసుకువస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన 53 లక్షల దిశ యాప్ లా డౌన్ లోడ్లే అందుకు నిదర్శనం. మహిళల భద్రతకు, సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే వారిపై అత్యాచారాలు తగ్గాయి. టోటల్ గా పై చర్యల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. అందుకే ఎన్సీఆర్బీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంది.
పస లేని ప్రతిపక్షం ఆరోపణలు
వాస్తవాలు ఇలా ఉంటే రాష్ట్రం ఏదో అల్లకల్లోలం అయిపోతున్నట్టు ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది. ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా ప్రభుత్వం తక్షణం స్పందించి విచారణకు ఆదేశిస్తోంది. బాధితులకు నష్ట పరిహారం వంటి ఉపశమన చర్యలు తీసుకుంటోంది. అదే తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతలా అఘొరించాయో అందరికీ తెలిసిందే. ఒక ఎమ్మార్వోను జుట్టు పట్టుకుని ఈడ్చినా, ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేను కొన్ని గంటలపాటు భయానక వాతావరణంలో తిప్పినా, కాల్ మనీ ఉదంతంలో మహిళలపై అత్యాచారాలు జరిగినా ప్రభుత్వ పెద్దలు స్పందించలేదు. పైగా పంచాయతీలు చేసి బాధితులకే చివాట్లు పెట్టిన ఘనత సాధించారు. మైనింగ్, ఇసుక. నీరు- చెట్టు, మట్టి అక్రమ తవ్వకాల ద్వారా టీడీపీ నేతలు కోట్లు కొల్లగొట్టినా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడేమో ప్రభుత్వం స్పందిస్తుంటే ప్రతిపక్షంగా బాధ్యత మరచి బాధితులను రెచ్చగొట్టడం ఏ తరహా రాజకీయమో వారే చెప్పాలి.
Also Read : వ్యవస్థను కాపాడే పోలీసు వ్యవస్థపై టీడీపీ దాడి