Bollywood : అందుకే మన సినిమాలకు ఎగబడుతున్నారు

ఆర్ఆర్ఆర్ చూశాక నార్త్ ఆడియన్స్ బాలీవుడ్ మేకర్స్ ని టార్గెట్ చేస్తున్నారు. ఒకప్పుడు సౌత్ హీరోల సినిమాలు హిందీలో పెద్దగా ఆడేవి కాదు. డబ్బింగే కాదు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు స్ట్రెయిట్ చిత్రాలు చేసినా చూపించిన ప్రభావం తక్కువే. కానీ ఒక్కసారిగా బాహుబలితో లెక్కలన్నీ మారిపోయాయి. ఇటీవలే వచ్చిన పుష్ప పార్ట్ 1 అక్కడి మార్కెట్ ఊహించని రీతిలో వంద కోట్లు రాబట్టడం అనూహ్యం. తర్వాత శ్యామ్ సింగ రాయ్ కూడా పర్లేదనిపించుకోగా అఖండ తెలుగు వెర్షన్ ని సైతం సబ్ టైటిల్స్ సహాయంతో చూసి శబాష్ అని సోషల్ మీడియాలో గొప్పగా మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ట్రిపులార్ వంతు వచ్చింది.

ఇదంతా ఎందుకు జరుగుతోందంటే హిందీలో ఇప్పుడు మాస్ సెగ్మెంట్ ని ఎవరూ పెద్దగా టార్గెట్ చేయడం లేదు. ఒక్క రోహిత్ శెట్టి, సల్మాన్ ఖాన్ లు మాత్రమే ఈ వర్గం మీద దృష్టి పెట్టి వాళ్ళ కోసమే సినిమాలు తీస్తుంటారు. అలా కాదంటే అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు మన రీమేకులు తీసుకెళ్లి ఏదో గట్టెక్కే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప స్వంతంగా కమర్షియల్ అద్భుతాలు చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు లేరు. ఎంతసేపూ మెట్రో లైఫ్, ఎక్స్ ట్రా మారిటల్ కాన్సెప్ట్స్, క్రాస్ లవ్ స్టోరీస్ తప్ప బిసి సెంటర్స్ లో పడిచచ్చే ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళ కోసం ఏమైనా చేద్దాం తీద్దాం అని ఉండదు. అందుకే ఈ పోకడ ఇన్ని విమర్శలకు దారి తీస్తుంది.

నిజానికి అక్కడా గ్రాండియర్లు తీస్తున్న వాళ్ళు లేకపోలేదు. కానీ భారీ ఖర్చు పెట్టి ఎమోషన్ ని పట్టడంలో, ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో వాళ్ళు చాలా వీక్. తగ్స్ అఫ్ హిందుస్థాన్, పానిపట్ లాంటి గ్రాండియర్లు ఎన్నో ఈ కారణంగానే ఫెయిల్ అయ్యాయి. సంజయ్ లీలా భన్సాలీ ఉన్నారు మూడేళ్ళకొకటి తీసే ఆయన నుంచి ఎక్కువ ఆశించలేం. నార్త్ వాళ్ళు మాస్ ని కోరుకుంటున్నారు. థియేటర్లలో విజిల్స్ వేయించే కంటెంట్ కావాలంటున్నారు. భాషతో సంబంధం లేదు. సీట్లో కూర్చున్న తమకు గూస్ బంప్స్ ఇచ్చేది ఎవరో వాళ్ళకే డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. చూస్తుంటే టాలీవుడ్ జెండా అక్కడ మరింత బలంగా పాతడం ఖాయమే

Also Read : KGF Chapter 2 : మూడు వారాల గ్యాప్ తో మరో ప్యాన్ ఇండియా

Show comments