Idream media
Idream media
ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల ఇళ్లకు ప్రోగ్రస్ రిపోర్టు పంపుతూ ప్రజాభిప్రాయ సేకరణ కోరారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇదే విధంగా తన పదేళ్ల పాలనపై రిపోర్ట్ కార్డును మమతా బెనర్జీ ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాదిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమత నిర్ణయం చర్చేనీయాంశంగా మారింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే.. ఇప్పటి నుంచే రాష్ట్రంలో రాజకీయాలు వాడివేడీగా ఉన్నాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గున మండుతోంది. ఇరు పార్టీలు ప్రసంగాలు, విమర్శలు, ఎత్తులు, పై ఎత్తులతో ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తన పదేళ్ల పాలనపై రిపోర్ట్ కార్డును మమతా బెనర్జీ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో చేసిన అభివృద్ధిపై విడుదల చేసిన ఈ రిపోర్టు కార్డుతో వచ్చే ఎన్నికలను అభివృద్ధి నినాదంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో టీఎంసీ ఉందనే విషయం స్పష్టంగానే తెలుస్తోంది.
పదేళ్ల అభివృద్ధి కార్యక్రమాలు
టీఎంసీ విడుదల చేసిన ఈ రిపోర్టు కార్డులో 2011లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బెంగాల్లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రధానంగా చెప్పుకొచ్చారు. దీనితో పాటు రానున్న రోజుల్లో కోటి మంది కార్యకర్తలు మమతా బెనర్జీ చేసిన అభివృద్ధిని ఇంటింటికి ప్రచారం చేయనున్నారట. ఇదే కనుక జరిగితే ఇంటింటి ప్రచారంలో ఇది ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. అంతే కాకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రచారాలను ఆస్కారమూ ఉంటుంది. టీఎంసీ విడుదల చేసిన రిపోర్టు కార్డులో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలలోని ముఖ్యాంశాలను పొందుపరిచారు. అవేమిటంటే.. జీడీపీ 53 శాతం పెరుగుదల, పారిశ్రామిక రంగంలో 60 శాతం వృద్ధి, వ్యవసాయ రంగంలో 30 శాతం వృద్ధి, యావరేజ్ పర్ కాపిటా ఆదాయం రెట్టింపు, కార్మికుల ఆదాయం 77 శాతం వృద్ధి, ప్రతి బ్లాకు, గ్రామ పంచాయతీల్లో ఉచిత మలవిసర్జక కేంద్రాలు, ఉపాధి హామీ పథకం కింద 1.63 కోట్ల ఉద్యోగాలు, విద్యా, క్రీడా బడ్జెట్ను మూడు రెట్లు, 30 కొత్త ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కాలేజీల ఏర్పాటు, ఆరోగ్య శాఖలో సెలవుల పెంపు, మహిళా పురోగతి వృద్ధి, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్లో వృద్ధికి సంబంధించిన పలు అంశాలను పొందుపరిచారు.