భారత క్రికెట్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యకు ముంబయి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. యూఏఈ నుండి ముంబయికి తిరిగి వస్తున్న సమయంలో కృనాల్ పాండ్య అనుమతులు లేకుండా బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులను దేశంలోకి తీసుకుని వస్తుండగా డైరక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు అతడిని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్బంధంలోకి తీసుకున్నారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ కేపిటల్స్ జట్టుపై ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన క్రికెటర్లు ఫైనల్ ముగిసిన వెంటనే స్వదేశానికి చేరుకోగా సభ్యులు చాలా మంది రెండు రోజుల పాటు దుబాయ్లోనే గడిపి కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేశారు. కృనాల్ పాండ్య కూడా భార్య పంఖూరి శర్మతో కలిసి దుబాయ్లో భారీ స్థాయిలో బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేశాడు.
కానీ కొనుగోలు చేసిన వస్తువులకు అధికారుల నుండి డిక్లరేషన్ పొందకుండా వాటిని దాచిపెట్టి ముంబయికి తీసుకొచ్చారు. కాగా ముంబయి విమానాశ్రయంలో తనిఖీ చేసినప్పుడు భారీ ఎత్తున బంగారం మరియు విలువైన వస్తువులను తీసుకొస్తున్నట్లు డీఐఆర్ అధికారులు గుర్తించడంతో కృనాల్ పాండ్యతో పాటు అతని భార్యను అదుపులోకి తీసుకుని నాలుగు గంటల పాటు విచారించారు. అనుమతి లేకుండా బంగారాన్ని తరలించడానికి ప్రయత్నించిన కారణంగా అతనిపై కేసు నమోదు చేసి ఈ కేసును కస్టమ్స్ అధికారులకు బదలాయించారు.
కాగా తనకి అనుమతులు గురించి తెలియవని అందుకే బంగారాన్ని తీసుకొచ్చినట్లు డీఐఆర్ అధికారులకు కృనాల్ పాండ్య వెల్లడించారు. జరిమానా కడతానని కృనాల్ అధికారులకు తెలిపారు. అయితే పన్నులు చెల్లించకుండా బంగారాన్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన కృనాల్ పాండ్య పిసినారితనాన్ని పలువురు విమర్శిస్తున్నారు.