iDreamPost
android-app
ios-app

సిగ్నల్ జంప్.. చలాన్లు చూసి షాక్.. పోలీసులపై విరుచుకుపడిన ఎమ్మెల్యే కుమార్తె

  • Published Jun 10, 2022 | 4:50 PM Updated Updated Jun 10, 2022 | 4:50 PM
సిగ్నల్ జంప్.. చలాన్లు చూసి షాక్.. పోలీసులపై విరుచుకుపడిన ఎమ్మెల్యే కుమార్తె

ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడమే కాకుండా పోలీసులపై విరుచుకుపడిందో యువతి. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసిన ఆ కారును పోలీసులు ఆపడంతో.. కారునే ఆపుతావా, నేనెవరో తెలుసా అంటూ ఆ పోలీస్ పై మండిపడింది. తప్పుచేయడమే కాకుండా.. ఆ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన ఆ యువతి.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ కూతురు కావడం గమనార్హం.

బీఎండబ్ల్యూ కారును డ్రైవ్ చేస్తూ రోడ్డుపైకొచ్చింది. ఒక చోట రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా.. రయ్ మని దూసుకెళ్లింది. దాంతో ట్రాఫిక్ పోలీస్ ఆమె కారును ట్రేస్ చేసి.. రాజ్ భవన్ రోడ్డులో ఆపారు. దాంతో అమ్మడికి చిర్రెత్తింది. నేను ఎమ్మెల్యే కూతుర్ని. నా కారునే ఆపుతావా అంటూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. “నేనేవరో తెలుసా. నేను ఇప్పుడు వెళ్లాలి.​ నా కారును ఆపోద్దు. ఓవర్‌టేక్ చేసినందుకు నాపై కేసు పెట్టలేవు. ఇది ఎమ్మెల్యే వాహనం. మా నాన్న అరవింద్ లింబావలీ” అంటూ అనుచితంగా ప్రవర్తించింది. ఇదంతా కెమెరాలతో వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా విరుచుకుపడింది.

యువతి నడిపిన బీఎండబ్ల్యూ కారు నెంబర్‌పై చలాన్లు పరిశీలించగా పోలీసులు ఖంగుతున్నారు. ఆమె వాహనంపై 9 వేల రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ చేసినందుకు రూ. 1000 జరిమానా విధించారు. మొత్తం ఆమె నుంచి రూ.10 వేలు వసూలు చేశారు. కొందరు ఇదంతా సెల్ఫోన్ కెమెరాలతో వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.