టీమిండియాకు తొలి ప్రపంచ కప్ అందించిన మాజీ టీమిండియా క్రికెట్ కెప్టెన్ కపిల్దేవ్ ఛాతినొప్పితో అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. సామాజిక మాధ్యమాలు, వార్త ఛానెళ్లలో కపిల్దేవ్ గుండెపోటుకు గురయ్యారన్న వదంతులు వ్యాపించడంతో ఆయన అభిమానులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.
గురువారం అర్ధరాత్రి కపిల్దేవ్ ఛాతినొప్పి కారణంగా ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకి యాంజీయోప్లాస్టీ చికిత్స అందించి ఐసీయూలో ఉంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని మరో రెండురోజుల్లో ఆసుపత్రి నుండి కపిల్దేవ్ను డిశ్చార్జ్ చేస్తామని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. కాగా కపిల్దేవ్కు గుండెపోటు వచ్చిందన్న వదంతులను ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా ఖండించారు. ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. గుండెపోటు అన్న వార్తలన్నీ వదంతులే అని అశోక్ మల్హోత్రా స్పష్టం చేశారు.
వదంతుల కారణంగా కపిల్దేవ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ క్రికెటర్ మదన్లాల్ సహా పలువురు మాజీ క్రికెటర్లు, టీమిండియా క్రికెటర్లు, క్రీడాభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా కోరుతున్నారు.