కరోనాతో పాటు, సినిమా షూటింగుల కారణంగా ఇంతకాలం ప్రజలకు దూరంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత ఆంధ్రప్రదేశ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాలలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 17న ఉదయం 11 గంటలకు ఈ ఐదు నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమీక్ష సమావేశంలో క్రియాశీలక సభ్యులకు పార్టీ అందిస్తున్న ఇన్స్యూరెన్స్ సౌకర్యానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ధ్రువపత్రాలు ప్రదానం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం జరుగుతుంది.
ఈ నెల 18న ఉదయం పది గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో సమావేశం అవుతారు. క్రియాశీలక సభ్యత్వం మరో 32 నియోజకవర్గాలలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి 32 నియోజకవర్గాల ఇంచార్జ్లతో 11 గంటలకు సమావేశమవుతారు. సభ్యత్వ నమోదు కోసం పార్టీ ఐ.టీ విభాగం రూపొందించిన యాప్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ను పరిశీలిస్తారు. ఈ రెండు సమావేశాలలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు, మరికొందరు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారని జనసేన రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు.