iDreamPost
android-app
ios-app

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటన ఖరారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటన ఖరారు

కరోనాతో పాటు, సినిమా షూటింగుల కారణంగా ఇంతకాలం ప్రజలకు దూరంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత ఆంధ్రప్రదేశ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్‌, అనంతపురం నియోజకవర్గాలలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 17న ఉదయం 11 గంటలకు ఈ ఐదు నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమీక్ష సమావేశంలో క్రియాశీలక సభ్యులకు పార్టీ అందిస్తున్న ఇన్స్యూరెన్స్ సౌకర్యానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ధ్రువపత్రాలు ప్రదానం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం జరుగుతుంది.

ఈ నెల 18న ఉదయం పది గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో సమావేశం అవుతారు. క్రియాశీలక సభ్యత్వం మరో 32 నియోజకవర్గాలలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి 32 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో 11 గంటలకు సమావేశమవుతారు. సభ్యత్వ నమోదు కోసం పార్టీ ఐ.టీ విభాగం రూపొందించిన యాప్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను పరిశీలిస్తారు. ఈ రెండు సమావేశాలలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు, మరికొందరు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారని జనసేన రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు.