Idream media
Idream media
రాష్ట్ర పురోభివృద్ధికి మూల స్తంభం విద్య. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అగ్రగామిగా దూసుకెళ్తున్నాయి. దురదృష్టవశాత్తూ ఏపీని పాలించిన గత పాలకులు విద్యా ప్రమాణాలను పట్టించుకోలేదు. ఫలితంగా దశాబ్దాల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం మార లేదు. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విద్య ప్రాముఖ్యతను గుర్తించి పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ఇప్పుడు కేంద్రం తెచ్చిన జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి రాష్ట్ర పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుంటూ కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతమున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 విధానం అమల్లోకి రానుంది.
పక్కా ఫౌండేషన్
నూతన విధానంలో మూడు రకాల విద్యాసంస్థలు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఇకనుంచి ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2, ప్రిపరేటరీ ఫస్ట్క్లాస్, 1వ తరగతి, 2వ తరగతితో ఉంటాయి. వీటిని ఫౌండేషన్ స్కూళ్లుగా పిలుస్తారు. ఆ తరువాత ప్రిలిమినరీ స్కూళ్లు (3, 4, 5 తరగతులు) ఉంటాయి. అనంతరం మిడిల్ స్కూళ్లు (6–8 తరగతులు), ఆపై సెకండరీ స్కూళ్లు (9నుంచి 12 తరగతులు) ఉంటాయి. అన్ని అంగన్వాడీ కేంద్రాలు ఇకపై వైఎస్సార్ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా పనిచేస్తాయి. సాధ్యమైనంత వరకు అంగన్వాడీ కేంద్రాలను స్కూళ్లలో అనుసంధానమయ్యేలా చేయాలి. అలా ఒకే ప్రాంగణం లేదా ఒకే భవనంలో ఇవి ఉండేలా చేసి.. వాటిని ఫౌండేషన్ స్కూళ్లుగా పరిగణించాలి.
విద్యార్థుల సంఖ్యను బట్టి అప్గ్రేడ్
ప్రతి ఫౌండేషన్ స్కూల్లో ఒక ఎస్జీటీ టీచర్ ఉంటారు. 1, 2 తరగతులకు బోధన చేస్తారు. ప్రిపరేటరీ–1 క్లాస్కు బోధనా సిబ్బందిని వేరేగా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత ప్రాథమిక స్కూళ్లలో ఉండే 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలోని యూపీ స్కూల్ లేదా హైస్కూళ్లకు తరలిస్తారు. 3 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులనే ఇలా తరలింపు చేయాలి. ఈ విద్యార్థులను తరలించేప్పుడు ఆ యూపీ, హైస్కూళ్లలో తరగతి గదులు లేకుంటే అదనపు తరగతి గదులు ఎన్ని నిర్మించాల్సి ఉంటుందో కసరత్తు చేసి వాటిని నాడు–నేడు కింద నిర్మిస్తారు. 3–5 విద్యార్థులు అదనంగా చేరినప్పుడు యూపీ స్కూలులో 150 మందికి మించి విద్యార్థుల సంఖ్య పెరిగితే దాన్ని హైస్కూల్గా అప్గ్రేడ్ చేస్తారు. 5 కిలోమీటర్ల సమీపంలోని సెకండరీ స్కూళ్లలో ఆయా మాధ్యమాల విద్యార్థుల సంఖ్యను అనుసరించి తెలుగు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా కొనసాగిస్తారు.
సెకండరీ స్కూళ్లలో ఇంటర్మీడియట్ తరగతులు
విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులను అనుసరించి సెకండరీ స్కూళ్లలో ఇంటర్మీడియెట్ తరగతులను ఏర్పాటు చేస్తారు. అక్కడ 12వ తరగతి వరకు ఉంటుంది. ఇలాంటి స్కూళ్లను గుర్తించాలి. ఇటువంటివి మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున ఏర్పాటవుతాయి. ప్రీ ప్రైమరీ, ఫౌండేషనల్, సెకండరీ స్కూళ్లను మ్యాపింగ్ చేసి స్కూల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేస్తారు. పిల్లల ఇంటికి సమీపంలో ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఉండాలి. ఫౌండేషన్ స్కూలు ఒక కిలోమీటర్ పరిధిలో, సెకండరీ స్కూలు 3 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. టీచర్, విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 1:30, మాధ్యమిక స్థాయిలో 1:35, సెకండరీ స్థాయిలో 1:40 ఉండేలా చూడాలి.
అంగన్ వాడీలకు ముప్పు వాటిళ్లకుండా చర్యలు
నూతన విద్యా విధానం వల్ల ఎక్కడా ఒక్క అంగన్వాడీ కేంద్రంగానీ, స్కూలు గానీ మూతపడకూడదు. విద్యార్థులను 3 కిలోమీటర్ల పైబడి తరలింపు చేయకూడదు. ఈ మార్గదర్శకాలను అనుసరించి డీఈవోలు, ఇతర అధికారులు నూతన విద్యావిధానం ప్రకారం స్కూళ్ల ఏర్పాటుకు మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలి. అలాగే ఎంతమంది పిల్లలు యూపీ, హైస్కూళ్లకు తరలింపు చేయాల్సి ఉంటుంది, అక్కడ అదనపు తరగతి గదులు ఎన్ని అవసరమో నిర్ణయించాలి. వీటిని 2022–23, 2023–24 సంవత్సరాల్లో నిర్మించేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.