iDreamPost
android-app
ios-app

మా రైతుల ప్ర‌యోజ‌నాల‌కు న‌ష్టం క‌లుగుతోంది : ప్రధానికి జగన్ మరో లేఖ..

మా రైతుల ప్ర‌యోజ‌నాల‌కు న‌ష్టం క‌లుగుతోంది : ప్రధానికి జగన్ మరో లేఖ..

ఏపీ – తెలంగాణ మధ్య నీటి యుద్ధం ఆగడం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులూ త‌మ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను తెలియ‌జేస్తూ.. కేంద్రానికి లేఖ‌లు రాస్తున్నారు. ఆవేద‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌రోసారి త‌మ‌కు క‌లుగుతున్న న‌ష్టం వివ‌రిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని నీటిని తెలంగాణ వదిలిపెడుతూ ఏపీకి సాగు తాగు నీటి కష్టాలు తెచ్చిపెడుతోందని గతంలో జగన్ లేఖ రాశారు. కృష్ణా బోర్డుకు ఫిర్యాదులు చేసిన సీఎం జగన్ ఇవాళ మరోసారి ప్రధాని మోడీకి లేఖ రాశారు. తెలంగాణను అడ్డుకోవడంలో కృష్ణాబోర్డుతోపాటు అపెక్స్ కౌన్సిల్ విఫలమయ్యాయని ఆరోపించారు.

ఏపీ తెలంగాణ జలవివాదాలపై ప్రధాని నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి జగన్ తాజాగా మరోసారి లేఖ రాశారు. జలశక్తి శాఖకు కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసినా వివాదాలు పరిష్కారం కావడం లేదని లేఖలో సీఎం ఫిర్యాదు చేశారు. తెలంగాణ వాడేస్తోన్న నీటిని తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని లేఖలో జగన్ కోరారు.

ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నీటిని వాడేయటం వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని జగన్ ప్రస్తావించారు. ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల విలువైన నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తిందని జగన్ ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ నీటి పంపకాల విషయంలో కృష్ణా నదీయాజమాన్య బోర్డు అపెక్స్ కౌన్సిల్ లాంటి యంత్రాంగాలు ఉన్నప్పటికీ తెలంగాణ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తోందని సీఎం లేఖలో పేర్కొన్నారు. తక్షణం తెలంగాణ చేస్తున్న నీటిని వినియోగాన్ని నిలువరించాలని జగన్ కోరారు. లేకుంటే ఏపీ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని లేఖలో జగన్ ప్రధానికి వివరించారు.

విభజన చట్టం ప్రకారం హక్కుగా ఏపీకి చెందాల్సిన నీటి వాటా విషయంలో నష్టపోవాల్సి వస్తుందని సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీటికి సంబంధించిన అవసరాలు ఉన్నప్పటికీ తెలంగాణ నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుండడం తమ రైతు ప్రయోజనాలకు నష్టం కలిగిస్తోందని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల దిగువన నీటిని ఏపీ వినియోగించుకోలేదని తెలిసి కూడా తెలంగాణ విద్యుత్ ను ఉత్పత్తి చేయటం దారుణమని సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో ఆరోపించారు. జూన్ 1 తేదీ నుంచి 26 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తే 19 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేశారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులపై కేఆర్ఎంబీతోపాటు సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పించేలా ఆదేశించాలని ప్రధాని మోడీని జగన్ లేఖలో కోరారు.