Idream media
Idream media
వైద్యున్ని దేవుడని ఎందుకు అంటామంటే దేవుడు ప్రాణం ఇస్తాడు. వైద్యుడు ప్రాణం పోస్తాడు కాబట్టి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజావైద్యుడు. ఆయనకి ప్రజానాడి తెలుసు, వైద్యమూ తెలుసు. అందుకే ఆయన మెడిసిన్ తర్వాత పులివెందుల లేదా కడపలో పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి కట్టి డబ్బు సంపాదించుకోలేదు. ప్రజలకి రూపాయి వైద్యం చేశాడు. నిజానికి చాలా మందితో ఆ రూపాయి కూడా తీసుకునే వారు కాదు.
జగన్ వైద్యుడు కాదు కానీ, వైద్యం విలువ తెలిసిన వాడు. అందుకే ఒకేరోజు 1068 అంబులెన్స్లో ప్రారంభించాడు. ఒక ఉద్యమంలా వాహనాలు కదిలి వెళుతుంటే అసలు దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఈ రకంగా ఎప్పుడైనా జరిగిందా అని ఆశ్చర్యం కలిగింది.
జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కేవలం వైద్యం అందక ఎవరూ చనిపోకూడదు. చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్లు అన్నింటి కంటే పెద్ద విషయం. ఇలాంటి సర్వీస్ నా చిన్నప్పుడు వుంటే మా టీచర్ కొడుకు బతికేవాడు.
నాకు ఆ ఆలు దిద్దించిన టీచర్ పేరు పుట్టమ్మ, ఈ రోజు నాలుగు అక్షరాలు రాయగలుగుతున్నానంటే ఆమె చేతి చలవే. మా టీచర్కి నెలల బిడ్డ ఉండేవాడు. నేను పాఠంతో పాటు, జోల పాట కూడా వినేవాన్ని. ఆ పిల్లాడికి ఒకరోజు అర్ధరాత్రి ఏదో శ్వాస ఇబ్బంది వచ్చింది. చేతిలో బిడ్డను పట్టుకుని టీచర్ ఏడ్చింది. డాక్టర్ కోసం పరిగెత్తింది. కానీ ఆ రోజుల్లో చిన్న పిల్లల వైద్యులు లేరు, వైద్యం కూడా అందుబాటులో లేని కాలం.
బిడ్డ చనిపోయాడు. ఆ దుక్కం నుంచి ఆమె తేరుకోలేక పోయింది. తలచుకుని తలచుకుని ఏడ్చేది.
ఈ రోజులా పిల్లల అంబులెన్స్ ఆ రోజుల్లో వుంటే ఆ పిల్లాడు బతికేవాడేమో. బతికుంటే అతనికి 50 ఏళ్లు పైగా వుండేవి. అతని భార్యా పిల్లల్ని చూసి మా టీచర్ సంతోషంగా నిండు నూరేళ్లు జీవించేదేమో!
కడుపు శోకం అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది.
రాజశేఖరరెడ్డి 108 అనే కలకన్నాడు
జగన్ 1068 వాహనాలతో దాన్ని నిజం చేసాడు.