Idream media
Idream media
పరిస్థితులకు తగ్గట్లుగా.. అధికారులను అలర్ట్ చేసి ప్రజాయోపయోగ నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి జగన్ సఫలీకృతం అవుతున్నారు. తాజాగా.. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే సంజీవని పేరుతో సంచార ఆర్టీసీ సేవలు ప్రజలకు అందుతున్నాయి. ఇంటింటికీ చేరి వైద్య సేవలు, పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా.. క్వారంటైన్ లో వసతులు మెరుగు పరచడంతో పాటు మరిన్ని ఏర్పాట్లు దిశగా అడుగులు వేసింది. తక్కువ కరోనా లక్షణాలు ఉండి.. హోం క్వారంటైన్ లో ఉండేందుకు అవకాశం లేని వారిని కొవిడ్ కేర్ సెంటర్స్ లో ఉంచుతున్నారు.
ఇక ప్రత్యేక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో…
ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టెస్ట్లు పెంచడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా కోవిడ్ ఆస్పత్రుల నిర్వహణ, పర్యవేక్షణపై జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కోవిడ్ ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్ల పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించింది. ఈ కీలక బాధ్యతలను ఐఏఎస్ అధికారి రాజమౌళికి అప్పగించింది. ఈ మేరకు స్పెషల్ ఆఫీసర్గా రాజమౌళిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ దూర దృష్టికి హ్యాట్సాప్..
అలాగే.. కొవిడ్ సెంటర్ల ఏర్పాటు లోనూ ప్రభుత్వ దూర దృష్టికి ఎవరైనా హ్యాట్సాప్ చెప్పక తప్పదు. సాధారణంగా లక్షణాలు తక్కువగా ఉంటే.. హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఆ అవకాశంలో లేని వారు కొవిడ్ సెంటర్లలో ఉండే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అత్యవసరమైతే కేవలం 15 నిమిషాలలోనే.. ఆస్పత్రులకు చేరుకునేలా ఆ సెంటర్ లను ఆస్పత్రులకు దగ్గరలోనే ఏర్పాటు చేశారు. దీని వల్ల బాధితులు ధైర్యంగా ఉండగలుగుతున్నారు.
3000 నుంచి 5000 వరకూ…
కరోనా రోగుల కోసం ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ ప్రస్తుతం 3000 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక వేళ కేసులు పెరిగితే ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వాటి సంఖ్యను 5000 కి పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అలాగే.. కరోనా నిధి కింద ప్రతి జిల్లాకూ కోటి రూపాయలు మంజూరు చేసింది. ల్యాబ్, ఎక్స్ రే మరియు టాయిలెట్స్ నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే ప్రతి ఒక్కరి డేటాను ప్రభుత్వం సేకరిస్తోంది. అవసరమైన వారికి టెస్టులు నిర్వహిస్తోంది. వారిని మానిటర్ చేసే బాధ్యత గ్రామ సచివాలయాలకు అప్పగించింది. ఐవీఆర్ ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ సేవల్లో అవసరమైన మార్పులు చేస్తోంది.
ఆహార ఏర్పాట్లపై జేసీ పర్యవేక్షణ
కొవిడ్ సెంటర్లలో ఆహారం నాణ్యంగా లేదుని వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. వీటి పైన పర్యవేక్షణకు ఏకంగా జాయింట్ కలెక్టర్స్ కు బాధ్యతలు అప్పగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మెనూ ప్రకారం వారికి ఆహారం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు గతం లో ఎన్నడూ లేని విధంగా భోజనం కోసం ఒక వ్యక్తి పై రోజుకు 500 రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు.