Idream media
Idream media
సీనియర్ నేత, మాజీ మంత్రి బుచ్చయ్య చౌదరి వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ఇంకా నానుతూనే ఉంది. మొదట్లో పెద్దగా స్పందించిన అధినేత చంద్రబాబునాయుడు ఆ తర్వాత కొన్ని సమీకరణాల నేపథ్యంలో ఆఘమేఘాల మీద ఆయనతో చర్చలకు సిద్ధమయ్యారు. బుచ్చయ్య పార్టీకి దూరం అయితే, ఆయన బాటలో మరింత మంది ప్రముఖులు సిద్ధంగా ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో బాబు అప్రమత్తమయ్యారు. కొంత టైం ఇస్తే బుచ్చయ్య అలకకు గల అన్ని సమస్యలనూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బుచ్చయ్యను అంతలా బతిమలాడడానికి కారణాలపై పార్టీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి.
రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. బాబు తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఎన్ని రాజకీయాలు చేస్తున్నా జగన్ ను ఢీ కొట్టడం ఆయన తరం కావడం లేదు. ఇలాంటి స్థితిలో ఉన్న నాయకులందరూ వెళ్లిపోతే కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇప్పటికే చాలామంది రెడీగా ఉన్నారు. వారిలో జ్యోతుల నెహ్రూ ఒకరు. గతంలోనే ఆయన పార్టీ నుంచి వీడిపోతారనుకున్నా.. ఆ వ్యవహారం అప్పట్లో సద్దుమణిగింది. తాజాగా జ్యోతుల నెహ్రూ అనారోగ్యం పాలవడంతో బుచ్చయ్య చౌదరి వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆ తర్వాత వైసీపీకి చెందిన మంత్రి, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా నెహ్రూని నేరుగా వెళ్లి పరామర్శించారు. దీంతో ఆయన వర్గం వైసీపీకి దగ్గరవుతుందనే విషయం స్పష్టమైంది. టీడీపీకి రాజీనామా ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. బుచ్చయ్యతో పాటు ఆయన కూడా బయటకు నడవాలనుకుంటున్నారని సమాచారం.
రాయపాటి సాంబశివరావు కూడా ఇదే లిస్ట్ లో ఉన్నారు. పార్టీపై, చంద్రబాబుపై ఆయన చాలాకాలంగా వ్యతిరేకతతో ఉన్నారు. కొరకరాని కొయ్యలా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ బ్యాచ్ లో వ్యక్తి కాకపోయినా ఆయన సెపరేట్ గా వ్యవహారం నడుపుతున్నారు. చాన్నాళ్లుగా పార్టీపై రుసరుసలాడుతున్నారు. బుచ్చయ్య బయటికొస్తే టైమ్ చూసి దెబ్బ కొట్టేందుకు కేశినేని నాని రెడీగా ఉన్నారట.మరో మాజీ మంత్రి నారాయణ కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టు ఊహాగానాలున్నాయి. ఆయనకు బుచ్చయ్య ఎపిసోడ్ కి ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఒక్కసారి బాబు చేతుల్లో నుంచి మనుషులు జారిపోవడం మొదలైతే అది బుచ్చయ్యతో మాత్రం ఆగిపోదు. చంద్రబాబుపై మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉన్న మరికొంతమంది సీనియర్లు కూడా టీడీపీకి టాటా చెప్పే ప్రమాదం ఉంది. అందుకే బాబు బుచ్చయ్యను టైమ్ అడిగి మరీ ఆయన కోరికలు నెరవేర్చే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.