భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తుంది. తొలి సెషన్లోనే డేవిడ్ వార్నర్ను(5) సిరాజ్ ఔట్ చేసి భారత్ కు బ్రేక్ అందించాడు. కొంతసేపటికే భారీ వర్షం రావడంతో దాదాపు నాలుగు గంటలపాటు ఆటకు అంతరాయం ఏర్పడింది.
వర్షం వెలిసిన అనంతరం ఆస్ట్రేలియా జట్టు పూర్తి సాధికారికతతో బ్యాటింగ్ చేయడంతో తొలిరోజు ఆట నిలిచే సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.కెరీర్లో తొలిటెస్టు ఆడుతున్న యువ బ్యాట్స్మన్ విల్ పకోస్కీ(62; 110 బంతుల్లో 4×4) అరంగేట్ర టెస్ట్ మ్యాచ్లోనే అర్ధ శతకం సాధించగా మార్నస్ లబుషేన్(67; 149 బంతుల్లో 8×4) కూడా అర్దశతకం సాధించాడు. మూడో వికెట్ కి పకోస్కి, మార్నస్ లబుషేన్ 100 జోడించిన అనంతరం నవ్దీప్ సైని బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
మొదటి రెండు టెస్టుల్లో విఫలమయిన స్టీవ్స్మిత్(31; 64 బంతుల్లో 5×4) కూడా రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, నవ్దీప్ సైని చెరో వికెట్ తీశారు. కాగా పకోస్కి ఇచ్చిన రెండు క్యాచ్లను పంత్ జార విడవడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది. నాలుగు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది.