13 రోజూ పెరిగిన ధరలు
దేశంలో పెట్రోల్ ధర పరుగుకు తెరపడటం లేదు. దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల రేట్లు కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. కొద్ది రోజుల క్రితం చమురు ఉత్పత్తులపై విధించిన పన్నుల పేరిట దేశ ప్రజానీకాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. వరుసగా పదమూడో రోజూ పెట్రోల్, డీజిల్ రేట్లను పెరిగాయి.
దేశంలో పెట్రోల్,డీజిల్ ధరల పరుగుకు తెరపడటం లేదు. 13 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ ధరలు మండుతూనే ఉన్నాయి. శుక్రవారం పెట్రోల్పై 56 పైసలు, డీజిల్పై 63 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో డిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.37, డీజిల్ లీటరు ధర 77.06కి ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆమేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్పై రూ.7.11, డీజిల్పై రూ.7.67 పైసలు పెరిగింది.
గురువారం పెట్రోల్పై 53 పైసలు, డీజిల్పై 64 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.77.81, డీజిల్ లీటరు ధర 76.43కి ఎగబాకింది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్పై రూ.6.55, డీజిల్పై రూ.7.04 పైసలు పెరిగింది.
అయితే అప్పుడు ప్రపంచ విపణిలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పిపాకు 80 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం పిపా రేటు 40 డాలర్లు మాత్రమే. పెట్రోల్ ధరలు కూడా 19 నెలల గరిష్టానికి చేరడం గమనార్హం. ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోల్ రూ. 80.77 కు చేరగా, డీజిల్ రూ. 74.70 గా నమోదైంది.
ఉపసంహరించాలి..
ఎక్సేజ్ సుంకం పెంచడం వల్ల, జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహ రించాలని, వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
గతంలో ఎన్నడూ లేనివిధంగా 13 రోజులు గా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా యని ఆందోళన వ్యక్తం చేశాయి.
చమురు కంపెనీలు పెంచుతున్నా కేంద్ర ప్రభుత్వం నోరెత్తడం లేదని విమర్శించాయి. లాక్డౌన్లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలు ఈ భారాలను భరించడం కష్టమని పేర్కొన్నాయి. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధి లోకి తేవాలని కోరాయి.
ప్రపంచ వ్యాప్తంగా బ్యారెల్ ముడిచ మురు ధరలు తగ్గుతుంటే కేంద్రం అడ్డగోలుగా పెట్రో, డీజిల్ ధరలను పెంచుతున్నదని విమర్శించాయి. సామాన్య ప్రజలు ఆందోళనగా ఉన్నారని, ఇప్పటికే లీటరుపై రూ.7 పెంచారని దుయ్యబట్టాయి.
అనేక దేశాల్లో తగ్గిన ధరల ప్రయోజనం ప్రజలు అనుభవిస్తుంటే మోడీ సర్కార్ ఈ దేశ ప్రజలకు మొండిచేయి చూపిస్తున్నదని విమర్శిస్తున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయిన ప్రజలను ఆదుకోవాల్సింది పోయి ప్రజలపై భారాలు వేయడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నాయి.
పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల రవాణా చార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి. కార్పొరేట్లకు పెద్దమొత్తంలో రాయితీలిస్తూ పేదల జేబులను కొల్లగొడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖజానా నింపుకోవడానికే మొగ్గు చూపిస్తున్నాయని విమర్శించాయి.
అయితే ఇలా రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపటం లేదు. ఆ భారం ప్రజలపై పడుతుంది.