Idream media
Idream media
ఊహించినట్లుగానే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన జేడీ(యూ)కి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. హరివంశ్ సింగ్ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైనట్టు రాజ్యసభ చీఫ్ ఎం వెంకయ్యనాయుడు సోమవారం ప్రకటించారు. వాయిస్ఓట్ ద్వారా రాజ్యసభ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఆర్జేడీ అభ్యర్థి మనోజ్ ఝాపై హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు.
హరివంశ్ సింగ్ అట్టడుగు వర్గం నుంచి వచ్చిన మేథావి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెద్దల సభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన హరివంశ్ సింగ్ను ఆయన అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. విపక్ష నేతలు సైతం హరివంశ్ను అభినందించారు.
ఇక అంతకుముందు హరివంశ్కు మద్దతుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మనోజ్ ఝాను బలపరుస్తూ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత రెండేళ్లుగా పెద్దల సభను హరివంశ్ నడిపించిన తీరుతో పార్టీలకు అతీతంగా పలువురు సభ్యుల నుంచి ఆయనకు ప్రశంసలు లభించాయి.
మద్దతు కూడగట్టడంలో విజయవంతమైన బీజేపీ
245 మంది సభ్యులు కలిగిన రాజ్యసభలో ఎన్డీయేకు 113 మంది సభ్యులుండగా, హరివంశ్ ఎన్నికకు అనుకూలంగా విపక్ష ఎంపీల మద్దతు కూడగట్టడంలో బీజేపీ విజయవంతమైంది. వాస్తవానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాలను సిద్ధం చేసింది. విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రణాళికలు రచించింది. దీనిలో భాగంగానే బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాయం కోరింది. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్ నవీన్ పట్నాయక్కు ఫోన్ చేశారు. అలాగే ఏపీ సీఎం జగన్ కు సహా పలువురు ముఖ్యమంత్రులకు కూడా ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. దీనికి స్పందించిన నేతలు హరివంశ్ కు మద్దతుగా ఓట్లు వేశారు.