వందేళ్లలో తొలిసారిగా జులై నెలలో, ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ(Dowleswaram Barrage) వద్ద వరద తగ్గుముఖం పట్టింది. వరద నీటి ఇన్ ఫ్లో, ఓట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) వద్ద కూడా గోదావరి వరద ఉద్ధృతి తగ్గుతూ వస్తోంది. ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటి మట్టం 36.1 మీటర్లుగా నమోదైంది. 19.58 లక్షల క్యూసెక్కుల వరద నీరు 48 గేట్ల ద్వారా దిగువకు ప్రవహిస్తోంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పొన్నపల్లి వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఏటి గట్టు ఫుట్ పాత్ రెయిలింగ్ కోతకు గురైంది. దీంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వశిష్ట గోదావరి ప్రవాహం తగ్గింది. కానీ 33 లంక గ్రామాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి.
వరదలు పూర్తిగా తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ హెచ్చరించింది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు స్టేట్ కంట్రోల్ రూం నుంచి సమీక్షిస్తున్నారు. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధిత కుటుంబాలకు రూ. 2 వేల చొప్పన ఆర్థిక సహాయం అందిస్తున్నారు. వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. అలాగే తాగునీరు, రేషన్ తో పాటు పశువులకు గ్రాసం కూడా సరఫరా చేస్తున్నారు. 10 ఎన్డీఆర్ఎఫ్ (NDRF), 10 ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయ. వరదల వల్ల ఆరు జిల్లాల్లోని 62 మండలాలకు చెందిన 385 గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పటివరకు 97,205 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు, 1,25, 015 ఆహార పొట్లాలను పంపిణీ చేశారు, 256 మెడికల్ క్యాంప్స్ నిర్వహించారు.