చంద్రబాబు ఒక రాజకీయ దళారని, అలాంటి వ్యక్తి రాజకీయాల్లో లేకుంటే మంచిదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారంటూ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారకుడని, ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకుని, ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. బాబు హయాంలో టీడీపీ నేతలు ఇసుకను వేలకోట్లలో దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు దివాళా తీయించారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వనరులు కాపాడాలనే లక్ష్యం తో ఉన్నారని, ప్రతి అంశంలో ఒక పాలసీ ప్రకారం ముందుకు వెళుతున్నారని వివరించారు.
కేవలం ఐదు నెలల పాలనలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. సీఎం జగన్ మంచి పరిపాలన చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే ఇసుక కొరతను శాశ్వతంగా లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. డైటింగ్ కార్యక్రమంలా లోకేష్ దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భవన నిర్మాణ కార్మికులను తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. కూలీలు, భవన నిర్మాణ కార్మికులు తప్పుడు మాటల వినొద్దంటూ, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.