iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షనేత చంద్రబాబుకు పరోక్షంగా లబ్ది చేకూరేలా వ్యవహరిస్తూనారని, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రమణ వీరిని వెనకనుండి ప్రోత్సహిస్తున్నారని, అలాగే అమరావతి భూముల కుంభకోణంలో జస్టిస్ రమణ, మాజీ అడిషినల్ జనరల్ దమ్మలపాటి శ్రీధర్ ల పాత్రపై ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
న్యాయవ్యవస్థలో కొందరు వ్యక్తుల వలన దాని ప్రతిష్ట దెబ్బతింటుందంటూ జగన్ నేరుగా ఆధారాలతో సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఎప్పటినుంచో న్యాయవస్థలో ఉన్న కొందరి వ్యవహారశైలిపై ఆరోపణలు వస్తున్నా ,ముఖ్యమంత్రిగా జగన్ నేరుగా వాటిని ప్రస్థావించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల్లోను, మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సీఎం జగన్ రాసిన లేఖపై ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ న్యాయకోవిదులు తమ అభిప్రాయన్ని చెబుతూ, జగన్ కి మద్దతు పలుకుతూ వచ్చారు.
అయితే ఇప్పుడు తాజాగా జగన్ రాసిన లేఖపై ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా స్పందించారు. జగన్ రాసిన లేఖ ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్ళిపోయింది కాబట్టి , ఈ పరిస్థితుల్లో ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం పెంపొందించాలి అంటే ఖచ్చితంగా లేఖలో ప్రస్థావించిన అంశాలపై విచారణ జరిగి తీరాలని దీనికై ఇన్ హౌస్ కమిటీ వేసి విచారణ చేపట్టాలని, అప్పుడే ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యు లో పేర్కొన్నారు.