Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ తీరు వివాదాస్పదం అవుతోంది. మనోన్మాదాన్ని రెచ్చగొట్టేలా ఇటీవల కొంత కాలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై ప్రజల్లోనే కాదు.. సొంత పార్టీలోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి ఒక్కరికీ కులాన్ని, మతాన్ని ఆపాదిస్తూ చంద్రబాబు మాట్లాడుతుండడంపై చర్చలు జరుగుతున్నాయి. 40 ఏళ్ల అనుభవం చెప్పుకునే బాబు.. విపత్కర పరిస్థితుల్లో వ్యవహరించే తీరు ఇదేనా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల మధ్య ప్రశాంత వాతావరణం ఏర్పరిచేలా హుందాగా వ్యవహరించాల్సింది పోయి.. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా రాజకీయాలు చేయడం తగదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు కులాన్ని, మతాన్ని అంటగట్టడం ఏ పాటి ధర్మమని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు మతాన్ని ఆపాదిస్తూ.. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు సంఘాలు సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యేనే చంద్రబాబు తీరుకు నిరసనగా పార్టీకి రాజీనామా చేశారంటే ఆయన రాజకీయాలపై ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో అవగతం చేసుకోవచ్చు.
ఏ అధికారైనా ప్రభుత్వబద్ధంగా పని చేయాలి. పని చేస్తాడు. తన వద్దకు వచ్చిన వ్యక్తి ని ఏం కావాలి.. అని అడుగుతారు కానీ ఏ కులం అని అడిగి పని చేయరు. అలాంటి అధికారులకు కులం, మతం అంటగడితే చట్టప్రకారం పని చేయలేడు. ఏ అధికారి అయినా విధి నిర్వహణలో అవినీతి, అలక్ష్యానికి పాల్పడినా, లేదా పక్షపాతం చూపినా ఆ అధికారిమీద తప్పకుండా చర్య తీసుకోవాలి. మన సమాజంలో అత్యంత నిజాయితీ పరులు, అత్యంత అవినీతిపరులు అన్ని కులాల్లో, మతాల్లో ఉన్నారు. ఈ రోజు ఒక కులానికి, మతానికి చెందిన వ్యక్తి అధికారంలో ఉండ వచ్చు. రేపు మరో కులానికి, మతా నికి చెందిన వ్యక్తి అధికారంలోకి రావచ్చు. అతడు ఏం చేస్తున్నాడు, పేద ప్రజలకు లాభం చేస్తున్నాడా లేదా? రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతున్నదా లేదా అతడేమైనా అవినీతికి పాల్పడుతున్నాడా? ఎక్కడైనా పక్షపాతం చూపుతు న్నాడా– వాటిని గమనించాలి. పొరపాటు ఉంటే ఖండించాలి. అంతే కానీ, అతని కులాన్ని బట్టి, మతవిశ్వాసాలను బట్టి ఆ వ్యక్తిని అంచనావేయడం చాలా తప్పు. చంద్రబాబు నాయుడి వంటి పరిపాలనా అనుభవం కలిగిన నాయకులు కులభేదాలను ప్రస్తావిస్తూ మాట్లాడడం సరికాదు.
చంద్రబాబు వైఖరి అసహ్యం పుట్టిస్తోంది..
క్రైస్తవ మతం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్ శనివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుకు రాజీనామా పత్రాన్ని పంపారు. అనంతరం విజయవాడ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు వైఖరి, ఆ పార్టీ వైఖరి అసహ్యం పుట్టిస్తుందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మెడలో శిలువ వేసుకుని బైబిల్ చదువుతూ నా జన్మధన్యమైందని ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. రామతీర్థం, ఇతర దేవాలయాల్లో జరిగిన ఘటనలకు క్రైస్తవానికి ఎటువంటి సంబంధం లేకపోయినా.. రాజకీయాల కోసం క్రైస్తవులను అవమానిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులంతా చంద్రబాబు పార్టీలో ఎలా కొనసాగుతున్నారంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. క్రైస్తవులను అవమానాలకు గురిచేస్తున్న టీడీపీ, చంద్రబాబు వైఖరి నచ్చక పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఫిలిప్ సి తోచర్ 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంగ్లో ఇండియన్ కోటాలో నామినేటెడ్ సభ్యుడిగా టీడీపీ నుంచి ఎన్నికయ్యారు.