iDreamPost
iDreamPost
మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి కొండూరు పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు పూనుకున్న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే కొండపల్లి ప్రాంతంలో మైనింగ్ కి అనుమతి ఇచ్చారు. స్వయంగా ఆయనే ప్రారంభోత్సవం కూడా చేశారు. అయినా ఇప్పుడు మాట మార్చారు. పైగా నాడు రెవెన్యూ భూములంటూ అనుమతించిన ఆయనే ఇప్పుడు వాటిని ఫారెస్ట్ భూములంటూ వివాదం రాజేసేందుకు ప్రయత్నం చేయడం దుమారం రేపింది. మంగళవారం టీడీపీ బృందం మైనింగ్ పరిశీలనకు వెళ్ళింది. ఆ సమయంలో స్థానికులతో ఘర్షణ జరిగింది. టీడీపీ నాయకుడి కారు ఒకటి స్వల్పంగా ధ్వంసం అయ్యింది.
ఈ ఘటనను ఆసరాగా చేసుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ ఆయన జి కొండూరు పీఎస్ వద్ద ఆందోళనకు పూనుకున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తలను సమీకరించారు. అదే సమయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు కూడా అక్కడికి చేరుకుని, పోటీగా ఆందోళన చేశారు. ఎమ్మెల్యేకి అనుకూలంగా నినాదాలు చేశారు.
దాంతో ఇరువర్గాలను శాంతింపజేసేందుకు పోలీసులు యత్నించారు. అధికార పార్టీ కార్యకర్తలు వెనక్కి తగ్గినా, దేవినేని ఉమా మాత్రం నిరసన కొనసాగించారు. దాంతో పోలీసులు చివరకు ఆయన్ని అదుపులోకి తీసుకుని అర్థరాత్రి హైడ్రామా కి ముగింపు పలికారు. ఈలోగా దేవినేని ఉమా మీద దాడి అంటూ పచ్చ మీడియా కథనాలు, ఏకంగా డిజిపికి చంద్రబాబులేఖ రాయడం చర్చనీయాంశంగా మారాయి.