టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో అవినీతి ఒక్కో రోజు ఒక్కో విధంగా బయటపడుతుంది. నాటి చంద్రబాబు పాలనలో మంత్రులు, రాష్ట్ర స్థాయి నేతలు నుంచి గల్లీలో ఉండే చోటాముటా నాయకులు వరకు అందరూ వివిధ విభాగాల్లో జరిగిన అవినీతిలో భాగస్వామ్యం ఉంది. వారి అవినీతి బండారం బయట పడుతుందని తెలుగు తమ్ముళ్లకు ముచ్చెమటలు పడుతున్నాయి.
‘‘ఊరూరా సిసిరోడ్లు వేశాం… అభివృద్ధి చేసి చూపించాం’’ అని ఊదరగొట్టిన తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు, గ్రామ పంచాయతీల నిధుల సంయుక్త వినియోగంతో వేసిన ‘చంద్రన్న బాట’ల నాణ్యతా ప్రమాణాల పని పట్టేందుకు ఓ వైపు క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో విజిలెన్స్ ఎన్పోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో జిల్లాలో ఇంజినీరింగ్ అధికారులతోపాటు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన టిడిపి నేతల బండారం బయట పడనుంది.
శ్రీకాకుళం జిల్లాలో చంద్రన్న బాటల నిర్మాణంలో భాగంగా 100 నుంచి 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో 90 శాతం ఉపాధి నిధులు, 10 శాతం పంచాయతీ నిధులతో కలిపి సిసి రోడ్లు వేశారు. జనాభా 2,001–4,999 మధ్య ఉన్న పంచాయతీల్లో 70 శాతం ఉపాధి నిధులు, 30 శాతం పంచాయతీ నిధులుతోనూ, 5 వేలకు మించిన జనాభా ఉన్న పంచాయతీల్లో సగం ఉపాధి నిధులు, మిగిలిన సగం పంచాయతీ నిధులతోనూ సిసిరోడ్లు నిర్మించారు. ఈ క్రమంలో 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్ల కాలంలో శ్రీకాకుళం జిల్లాలో 1,460 కిలోమీటర్ల మేర సిసి రోడ్లు నిర్మించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 2018 అక్టోబర్ 1 నుంచి 2019 మే 31వ తేదీ వరకు రూ.132 కోట్లుతో 350 కిలోమీటర్లు మేర సిసి రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం రూరల్ మండలం కాజీపేట, కిల్లిపాలెం, చాపురం తదితర పంచాయతీల్లో రోడ్లపై రోడ్లు వేసినట్లుగా అధికారులు గుర్తించారు. వీటి లెక్కలు తేల్చాలని నిర్ణయించారు.
జిల్లాలో గత ఐదేళ్లలో 1,460 కిలోమీటర్ల సిసి రోడ్లలో దాదాపుగా టిడిపి నేతలు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి గ్రామీణ ప్రాంతాలకు అనుసంధాన రోడ్లు పేరిట ఇష్టానుసారంగా సిసి రోడ్లు నిర్మించి లక్షలాది రూపాయలు బొక్కేశారు. ఇక్కడ నాణ్యతను అప్పటి అధికారులు పక్కనపెట్టి ఇస్టానుసారంగా అనుమతులిచ్చి బిల్లులు చెల్లించారు.
ఇందులో ఇంకా బిల్లులు చెల్లించాల్సిన పనుల విషయంలోనైనా ప్రత్యక్షంగా నాణ్యతను పరిశీలించిన తర్వాతే బిల్లులు చెల్లించాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల ప్రకారం జీవో 271 ప్రకారం నిర్మాణ పనులను క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది నూటికి నూరు శాతం పనులన్నీ పరిశీలించిన తర్వాతే బిల్లులు చెల్లించాల్సి ఉంది. తనిఖీల్లో భాగంగా ప్రతి రోడ్డుకు కోర్ కటింగ్ శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేసిన తర్వాత నాణ్యతను గుర్తించాల్సి ఉంది.
ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజుల్లో వీటి నిర్మాణాలు మరింత దూకుడుగా సాగించారు. శ్రీకాకుళం రూరల్తో పాటు ఆమదాల వలస, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, రాజాం, ఎచ్చెర్ల తదితర నియోజకవర్గాల్లో రోడ్లుపై రోడ్లు వేసి మరీ బిల్లులు పెట్టేశారనే సమాచారం అధికారుల వద్ద ఉంది. దీనిపై విజిలెన్స్ రంగంలోకి దిగడంతో త్వరలో బండారం బయటపడనుంది.
శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి నిధులు, పంచాయతీ నిధులను సంయుక్తంగా వినియోగించి నిర్మించిన చంద్రన్న బాట సిసి రోడ్లలో అవినీతి అక్రమాల లెక్క పనిలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు పడ్డారు. ఐదారు రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖల క్వాలిటీ కంట్రోల్ అధికారులంతా మొత్తం 10 బృందాలుగా తనిఖీలు చేపడుతున్నాయి. డ్వామా పిడి ఆధ్వర్యంలో ఈ బృందాలు ఇప్పటికే పలు గ్రామ పంచాయతీల్లో సిసి రోడ్ల నాణ్యతను పరీక్షిస్తున్నాయి. ఈప్రక్రియ అంతా త్వరితగతిన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో తనిఖీలు వేగవంతం చేశారు.
ఈ నాణ్యతా తనిఖీలో నాటి డొల్లతనం బయట పడుతుంది. తెలుగు తమ్ముళ్ల బండారం బయట పడటంతో వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఇలాంటి నాణ్యతా రహిత రోడ్ల నిర్మాణంలో ఇప్పటికే కొంత మంది తెలుగు తమ్ముళ్లు అడ్డంగా దొరికారు. పనులు చేయని వాటికి బిల్లులు చేసుకొని డబ్బును మెక్కేశారు. ఇలా నాడు చంద్రబాబు హయంలో అవినీతి క్షేత్రస్థాయిలో జరిగింది. దాన్ని మానేసి చంద్రబాబు నేడు వైఎస్ జగన్ ప్రభుత్వంపై అవినీతి విమర్శలు చేయడం దారుణం.
8571