iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ల సంఖ్య తగ్గుతోంది. ఈ తగ్గుదల వరుసగా మూడవ రోజు కూడా నమోదు కావడం పట్ల సర్వత్రా ఆశాభావం నెలకొంది.
ముందుగా అంచనా వేసిన ప్రకారం ఆగష్టు 14వ తేదీ తరువాత ఏపీలో కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. అందుకు తగినట్లుగానే గత మూడు రోజులుగా కేసుల నమోదులో గుర్తించదగ్గ మార్పు కన్పిస్తోంది. ఆగష్టు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 9–10వేలకు మధ్యలో పాజిటివ్లు నమోదవుతూ వచ్చాయి. ఆ తరువాత నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 16న 8,012 పాజిటివ్లు నమోదు కాగా, 17న 6,780 మాత్రమే నమోదయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది.
వరుసగా పెరుగుతూ పోయిన కేసులతో ప్రజల్లో అలజడి నెలకొంది. అయితే ప్రస్తుతం పాజిటివ్ల సంఖ్య తగ్గుతుండడంతో మున్ముందు పరిస్థితి మరింత కుదుటపడుతుందన్న భావన వ్యక్తమవుతోంది. గడచిన 24 గంటల్లోనూ 44,578 టెస్టులు నిర్వహించారు. అలాగే ప్రకాశం జిల్లాలో 13 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది, చిత్తూరులో 8, గుంటూరులో 7, కడపలో 7, శ్రీకాకుళంలో 6, పశ్చిమలో 6, అనంతపురంలో 5, కర్నూల్లో 5, విశాఖలో 5, విజయనగరంలో 5, కృష్ణాజిల్లాలో 3, నెల్లూరులో రెండు మరణాలు చోటు చేసుకున్నాయి.
అలాగే 7,866 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని ప్రభుత్వ బులిటెన్ ద్వారా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 29, 05,521 సాంపిల్స్ను పరీక్షించింది. 2,96,609 పాజిటివ్లు గుర్తించారు. 2,09,100 మంది రికవరీ అయ్యారు. 84,777 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పటి వరకు కోవిడ్ భారిన పడి 2,732 మంది మృతి చెందారు.