Idream media
Idream media
రాజ్యాంగ్యాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తూ ప్రజల ఆర్థిక, సామాజిక న్యాయానికి, సమానత్వానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని ఆయన ఈ రోజు శనివారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ వందనం, మువ్వన్నెల జెండా ఆవిష్కరణ తర్వాత మాట్లాడారు.
స్వాతంత్రం వచ్చినా విద్యా రూపేన వివక్ష కొనసాగుతోందన్న సీఎం జగన్ వివిక్ష రూపుమాపాలని రాజ్యాంగంలోని ఆర్టికల్17ను ఈ సందర్భంగా గుర్తు చేశారు. పెద్దలు.. వారి పిల్లలు, మనవళ్లు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలని, పేద, మధ్య తరగతి పిల్లలు తెలుగుమీడియంలో చదవాలనే భావనను ఇప్పటి వరకూ ప్రభుత్వాలు కొనసాగించాయి. ఆ వివక్షను రూపుమాపేలా తమ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నామని, నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నామని జగన్ వివరించారు.
రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలు ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధి, సమానత్వం కోసం ఏమేమి చేయాలో నిర్థేశిస్తోందన్న సీఎం జగన్.. ఆర్టికల్ 38ని తు.చ తప్పకుండా అమలు చేస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. ప్రజల ఆర్థిక, సామాజిక ఉన్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు, నిర్ణయాలు తీసుకున్నామని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత, ఆసరా.. తదితర పథకాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ కాంట్రాక్టులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ మరోమారు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మూడు ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించామని తెలిపారు. త్వరలో విశాఖ నుంచి కార్యనిర్వాహక, కర్నూలు నుంచి న్యాయరాజధాని కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని ఆయన పునరుద్ఘాటించారు.