Idream media
Idream media
ప్రతీ తల్లి తన బిడ్డ గొప్పగా చదువుకోవాలనే భావిస్తుంది. అందుకోసం తన శక్తికి మించి కష్టపడుతుంది. కొన్ని కుటుంబాలలో భార్యాభర్తలిద్దరూ కష్టపడినా కానీ.. తమ బిడ్డలకు ఫీజులు చెల్లించి ప్రైవేటు స్కూళ్లలో చేర్పించలేని పరిస్థితి. మరి ప్రభుత్వ పాఠశాలలో చదివిద్దామంటే గత పాలకుల పుణ్యమా అని వాటిపై ఎక్కడో చిన్నచూపు ఉన్నదాయే..! అన్ని రంగాలకూ నిధులు కేటాయించినా విద్యాశాఖపై పాలకులకు చిన్నచూపు ఉండేది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధికి దూరంగా ఉండేవి. తాగేందుకు నీళ్లు కూడా లేని పాఠశాలలెన్నో ఉండేవి. మరుగుదొడ్లు కూడా కరువే.
ఇక పిల్లలకు పుస్తకాలు అందే సరికి సగం విద్యా సంవత్సరం ముగిసిపోయేది. జూన్లో బడులు తెరిస్తే అక్టోబర్లో పుస్తకాలు ఇచ్చే దుస్థితి. మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ లేకపోగా బిల్లులు, ఆయాల జీతాలు 8 నెలలు పెండింగ్లో పెట్టేవారు. ఇంగ్లిష్ మీడియం కేవలం ప్రైవేట్ బడుల్లోనే ఉండేది. అక్కడ ఫీజులు ఎక్కువ కావడంతో చదివించాలంటే స్థోమత లేని పరిస్థితి. ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం మాత్రమే ఉండేది. బాత్రూమ్లు దారుణంగా ఉండేవి. వీటన్నింటితో ప్రభుత్వ బడులు శిథిలావస్థకు చేరుకున్న దుస్థితి. మరోవైపు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు విపరీతంగా పెంచేందుకు అనుమతులిచ్చి పేద పిల్లలను చదువుకు దూరమయ్యే పరిస్థితి నాటి పాలకులు కల్పించారు. అటువంటి పరిస్థితుల నుంచి మా బిడ్డ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడని గర్వంగా చెప్పుకునే విధంగా ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చారు సీఎం జగన్.
విద్యా రంగానికి ఎప్పుడైనా ఇన్ని నిధులు కేటాయించారా..?
ఇప్పటి వరకూ ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు తరలిపోవడమే చూశాం. చరిత్రలో తొలిసారిగా ఆంద్రప్రదేశ్లో రివర్స్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం విద్యారంగంపై చూపుతున్న శ్రద్ధ, కేటాయిస్తున్న నిధులు, కల్పిస్తున్న సౌకర్యాల కారణంగా తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీనికి జగన్ అందిస్తున్న అమ్మ ఒడి చారిత్రాత్మక గుర్తింపు పొందింది. దాదాపు 45 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా కోట్లాది రూపాలయ లబ్ధిచేకూరుతోంది.
19 నెలల్లో విద్యారంగంపై రూ.24 వేల కోట్లు ఖర్చు
19 నెలల ప్రభుత్వ పాలనలో పిల్లల చదువుల కోసం అక్షరాల రూ.24 వేల కోట్లు ఖర్చు చేసింది వైసీపీ ప్రభుత్వం. ఒక్క జగనన్న అమ్మఒడి పథకం ద్వారానే రూ.13 వేల కోట్లు, విద్యా దీవెన ద్వారా 18.51 లక్షల మంది పిల్లలకు రూ.4,101 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా రూ.1,221 కోట్లు, సంపూర్ణ పోషణ కింద రూ.1,863 కోట్లు, జగనన్న విద్యా కానుక కింద దాదాపు రూ.648 కోట్లు, జగనన్న గోరుముద్ద ద్వారా రూ.1,456 కోట్లు అందిస్తోంది. పాఠశాలల్లో నాడు-నేడు కింద మొదటి దశలో రూ.2,600 కోట్లు ఖర్చు చేసి మొత్తంగా రూ.24,600 కోట్లు ఖర్చు చేసింది. పేదింటి పిల్లలంతా చదువుల బడికి వెళ్లి గొప్ప చదువులు చదవాలని అమ్మఒడికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా విద్యా రంగానికి ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం ఇదే ప్రప్రథమం. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థలు సంఖ్య పెరుగుతోంది. ప్రతి అక్కా, చెల్లి తనను నమ్మారని, తమ బిడ్డలను వారి మేనమామ చూసుకుంటాడనే నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నారని, అందుకే గతంలో 38 లక్షలు ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ రోజు 42 లక్షలకు చేరిందని జగన్ సగర్వంగా చెబుతున్నారు.
పౌష్టికాహారం.. ఇంగ్లీషు మీడియం..
ప్రతి పిల్లవాడికి ఆరో సంవత్సరం వచ్చే సరికి 85 శాతం బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. అలాంటి సమయంలోనే గట్టి పునాదులు పడతాయి. అందుకే మంచి పౌష్టికాహారంతో పాటు ఇంగ్లిష్ మీడియంలో పునాదులు కూడా పడాలని ఖర్చుకు వెనుకాడకుండా ప్రభుత్వం అమలు చేస్తోంది. విద్యాకానుక ద్వారా ఇచ్చే స్కూల్ కిట్ల నాణ్యతను సీఎం స్వయంగా బూట్లు పట్టుకుని పరిశీలించారు. ఈసారి మరింత నాణ్యతతో ఉండాలని అధికారులకు చెప్పారు. నాడు-నేడుతో స్కూళ్లను సమూలంగా మార్చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ మార్చి రోజుకో వెరైటీతో జగనన్న గోరుముద్ద పథకాన్ని తెచ్చారు. కంటి వెలుగు పథకం ద్వారా పరీక్షలు చేయిస్తున్నారు. ఇంటర్ తర్వాత పిల్లల చదువులు ఆగి పోకూడదని పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు విద్యాదీవెన, హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన ద్వారా ఏటా ప్రతి పిల్ల వాడికి రూ.20 వేలు ఇస్తున్నారు.. కరిక్యుకులమ్లో మార్పులు చేసి చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు వచ్చేలా అప్రెంటీస్షిప్ను అమలు చేస్తున్నారు. 8వ తరగతి నుంచే కంప్యూటర్ లిటరసీ కోర్సు కూడా ప్రవేశ పెట్టారు.. డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడి చదువుకునే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో కల్పించారు. ప్రతి పిల్లవాడిలో ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా కాన్వెంట్ బడులకు వెళ్తున్నప్పుడు ఉండే ఆత్మ స్థైరం మాదిరిగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను మార్చారు. పిల్లల భవిష్యత్ కు గట్టి పునాదులు ఏర్పడ్డాయి. ఇవన్నీ గమనిస్తున్న తల్లులు తమకు ఇంత కన్నా ఏం కావాలి.. అని సంతృప్తిగా చెబుతుండడం గమనార్హం.