iDreamPost
android-app
ios-app

బాబూ.. పుత్ర ర‌త్నం కోస‌మే ఇదంతా..!

బాబూ.. పుత్ర ర‌త్నం కోస‌మే ఇదంతా..!

ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పథకాల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు జరుగుతున్నాయి. రాజకీయంగా జరుగుతున్న గొరిల్లా యుద్ధతంత్రాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి ’’ అని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. ఓ ముఖ్య‌మంత్రి ఇంత‌లా స్పందించారంటే ప‌రిస్థితులు అదుపు త‌ప్పుతున్నాయ‌ని గుర్తించిన‌ట్లు అర్థం అవుతోంది.

ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే ఏపీలో ఇలాంటి దారుణ ప‌రిస్థితుల‌కు కార‌ణాలు అంద‌రికీ తెలిసిందే. దేవాల‌యాల‌పై వ్యూహాత్మ‌కంగా జ‌రుగుతున్న దాడులే. ఈ దాడుల వెనుక ఉన్న‌ది ఎవ‌రు..? కార‌ణాలేంటి అనేది త్వ‌ర‌లో నిర్ధార‌ణ అవుతుంది. కానీ ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు అది తీవ్రంగా మారి ప్ర‌జ‌ల మ‌ధ్య అశాంతి రేగ‌డానికి కార‌ణం మాత్రం ప్ర‌తిప‌క్షాలే అని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌ధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్థంలో రేపిన ర‌చ్చ తెలిసిందే. ఎన్న‌డూ లేని విధంగా చంద్ర‌బాబు ఇంత దిగ‌జారుడు రాజ‌కీయాలు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఏపీలో అంతంత మాత్రంగానే ఉన్న టీడీపీని బ‌తికించుకోవ‌డానికి, చేత‌కాని రాజ‌కీయాల‌తో న‌వ్వుల పాల‌వుతున్న లోకేశ్ ను తెర‌పైకి తెచ్చేందుకే ఇదంతా చేస్తున్నార‌నేది వైసీపీ ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

ఉన్మాద ధ్వంస ర‌చ‌న‌కైనా సిద్ధ‌మేనా..

అసమర్థుడయిన పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద ధ్వంసరచనకైనా సిద్ధమేనని.. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో .. ’14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ముసుగు తొలగించి ఇకపై తాను కొందరికే ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించాడు. మొదట నీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చి సూటిగా చెప్పేసేయ్ బాబూ’ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ముందుకు సాగడం ప్రకృతి నియమం. మధ్య యుగాల నాటి ఉన్మాద మనస్థత్వంతో చంద్రబాబు రాకెట్ వేగంతో తిరోగమనంలోకి దూసుకెళ్తున్నాడు. ప్రపంచం పురోగమనం వైపు పరుగులు పెడుతుంటే అందుకోలేనంత వెనక పడిపోయాడని, ఒంటరిగా మిగిలిపోయాడని తొందర్లోనే తెలుస్తుంది’ అంటూ వరుస ట్వీట్‌లలో చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

విజ‌య‌సాయి ఇంత‌లా ఆగ్ర‌హం చెంద‌డానికి.. సీఎం జ‌గ‌న్ తీవ్రంగా స్పందించ‌డానికి ప్ర‌స్తుతం ఏపీలో కొన‌సాగుతున్న అల్ల‌ర్లే కార‌ణం. వాటిని క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లకు సిద్ధ‌మైంది. త్వ‌ర‌లో వాటి వెనుక ఉన్న కుట్ర చేధించే ప‌నిలో ఉంది.