Idream media
Idream media
అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతూ మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేస్తున్న ఉద్యమంతో ఏపీలో తెలుగుదేశం ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయింది. ఆ పార్టీలో కొనసాగలేక ఎమ్మెల్యేలు, నేతలే పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కేడర్ కూడా పార్టీకి దూరం అవుతోంది. దీనికి తోడు ప్రస్తుతం అమరావతి భూ కుంభకోణం సృష్టిస్తున్న ప్రకంపనలు తెలుగుదేశాన్ని కుదిపేస్తున్నాయి. ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయింది. అచ్చెన్ననాయుడు, జేసీ, కొల్లు సహా ఆ పార్టీ కి చెందిన కొందరు ప్రముఖ నేతలు కొంత కాలంగా జైళ్లు.. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ పై బతుకీడుస్తున్నారు.
ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధినేత
ఇప్పుడు అమరావతి భూ కుంభకోణంపై విపరీతమైన చర్చ జరుగుతున్న తరుణంలో అధినేత చంద్రబాబు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని ఎల్లో మీడియా ద్వారా చెప్పించుకోవడానికి ఎన్ని తంటాలు పడుతున్నావెలుగుచూస్తున్న ఆధారాలతో ఆయన వల్ల కావడం లేదు. దాన్ని నుంచి దృష్టి మరల్చడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా కొత్తగా హిందూత్వ వాదాన్ని కూడా ఎత్తుకున్నారు. దీంతోపాటు విశాఖలో భూ కుంభకోణమంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. అయినప్పటికీ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితి ప్రజల్లో కనిపించడం లేదు.
స్టే లు కొనసాగుతున్న కేసులపై చర్చ
అమరావతి కేసులకు తోడు.. పాత కేసులపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. చాలా కేసుల్లో చంద్రబాబుపై ఏళ్ల తరబడి ‘స్టే’లు కొనసాగుతున్నాయి. వాటిపై వెంటనే విచారణ ప్రారంభించాలని డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో స్టేలు మంజూరైన వాటన్నింటికీ సంబంధించి వేగంగా విచారణ జరిగి, వెంటనే శిక్షలు పడాల్సిన వాటిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించనుండటంతో అలాంటి కేసులు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
చంద్రబాబు అక్రమాస్తుల కేసు
దివంగత ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి 15 ఏళ్ల క్రితమే చంద్రబాబు అక్రమ ఆస్తులకు సంబంధించి వేసిన కేసు చాలా ముఖ్యమైనది. దేశ చరిత్రలోనే దీర్ఘకాలంగా విచారణ జరగకుండా స్టే ఉన్న కేసుల్లో ఇది నెంబర్ వన్. ఈ కేసును విచారిస్తారా? లేదా? అనేది తేలాలి. ఓటుకు నోటు కేసు దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. ఆ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసులో కూడా ఇప్పటికీ విచారణ ముందుకు కదలలేదు. దీంతో వెంటనే శిక్ష విధించే వీలున్న కేసుగా న్యాయస్థానానికి అప్పగిస్తారా? అన్నది చూడాలి. అలాగే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్పై నమోదైన కేసు కూడా ధర్మాసనానికి అప్పగిస్తారా? అన్న చర్చ కొనసాగుతోంది.