iDreamPost
android-app
ios-app

బాబూ.. బీసీ జ‌పం బ‌ద్ధ‌లు..!

బాబూ.. బీసీ జ‌పం బ‌ద్ధ‌లు..!

బీసీలకు ఏపీ ప్ర‌భుత్వం ఇస్తున్న ప్రాధాన్యం తెలిసిందే. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ విధానాలతో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ నేత పిటిషన్‌ కారణంగా రిజర్వేషన్లను హైకోర్టు తగ్గించినప్పటికీ వైఎస్‌ జగన్‌ స్థానిక ఎన్నికల్లో తన పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అలాగే 139 బీసీ కులాలకు గానూ ప్ర‌స్తుతానికి 56 కార్పొరేషన్ల పాలక మండళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో ఒక్కో కార్పొరేషన్‌కు ఛైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించగా.. ఛైర్మన్, డైరెక్టర్ పదవుల్లో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పించింది. బీసీలకు ఏటా 15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు గాను 75వేల కోట్ల రూపాయలు బీసీ ఉప ప్రణాళికకు కేటాయిస్తామని ఎప్పుడో స్పష్టం చేసింది. ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు, సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌లో అత్య‌ధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వ‌ర్గాలే ఉన్నారు. వీట‌న్నింటి ఫ‌లితంగా జ‌గ‌న్ బీసీ ప‌క్ష‌పాతిగా పేరు పొందుతున్నారు. ఇవ‌న్నీ చూస్తు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు ప‌దే ప‌దే వ‌ల్లించే మంత్రం త‌మ పార్టీ బీసీల‌కు ప్రాధాన్యం ఇచ్చింద‌ని. జ‌గ‌న్ పార్టీ బీసీల‌ను మోసం చేస్తోంద‌ని. 


ఇప్పుడేమంటారు బాబూ…

ఏళ్ల త‌ర‌బ‌డి తెలుగుదేశం పార్టీలో ఉండి ప్ర‌స్తుతం చంద్ర‌బాబు వ్య‌వ‌హార‌శైలి న‌చ్చ‌క ఒక్కొక్క‌రు పార్టీ వీడుతున్నారు. 10, 20 ఏళ్లుగా టీడీపీయే ఊపిరిగా బ‌తికిన వారు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నారు. అందుకు వారు చెబుతున్న కార‌ణాల‌ను ప‌రిశీలిస్తే అస‌లు నిజం తెలుస్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం బీసీ ల‌కు ఇస్తున్న ప్రాధాన్య‌మే త‌మ‌ను ఆక‌ర్షిస్తోంద‌ని ముక్త‌కంఠంతో చెబుతున్నారు. 7 లక్షల 82 వేల మంది బీసీ విద్యార్థుల చదువుల కోసం ఫీజు రీయింబర్స్ చెల్లించడానికి బడ్జెట్‌లో 2 వేల 218 కోట్ల రూపాయలు కేటాయించింది జ‌గ‌న్ మాత్ర‌మే. అంతేకాదు బీసీ పిల్లలను బడికి పంపిస్తే వారి తల్లులకు ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలు చెల్లించేలా ఉప ప్రణాళికలో 12 వందల 94 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే ఆయా బీసీ కులాల కుటుంబాలకు వైఎస్‌ఆర్ బీమా ద్వారా 5 లక్షల రూపాయల సాయం అందిస్తున్నారు. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై ఇమేజ్ పెంచుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు త‌న పంథా మార్చుకోక పోవ‌డం వ‌ల్లే పార్టీని వీడుతున్నట్లు కొంత మంది నేత‌లు వెల్ల‌డిస్తున్నారు.

చంద్ర‌బాబు విఫ‌లం..

ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారని పోతుల సునీత విమర్శించారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. బీసీలని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు కోసం మాత్రమే వాడుకున్నారని ధ్వజమెత్తారు. గత 20 సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న తానే అనేక అవమానాలకు గురి అయ్యానని పోతుల సునీత తెలిపారు. టీడీపీ వైఖరి అంబేడ్కర్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌ పాలన కొనసాగుతోందని ప్రశంసించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారని, అందుకే ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అంశంపై పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా పోతుల సునీత తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్‌కు పంపించిన విష‌యం తెలిసిందే.