Idream media
Idream media
మత్తు డాక్టర్ సుధాకర్ ఘటనలో ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ ఘటనపై విశాఖ పోలీసులపై కేసు పెట్టి దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు విశాఖ పోలీసులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
డాక్టర్ సుధాకర్ అభియోగాల మేరకు గుర్తుతెలియని పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు మరికొందరిపై సెక్షన్ 120–బి, 324, 343, 379, 506 కింద కేసు పెట్టారు. నేరపూరిత కుట్ర, కావాలని దూషించడం, మూడు రోజులకుపైగా అక్రమ నిర్బంధం, దొంగతనం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ విశాఖ సీబీఐ ఎస్పీ పుట్టా విమలాదిత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కేసు నమోదు చే సిన తర్వాత సీబీఐ అధికారులు డాక్టర్ సుధాకర్ నుంచి వాగ్మూలం తీసుకున్నారు. ‘‘ ఈనెల 16వ తేదీన అనకాపల్లి బ్యాంకులో హౌసింగ్ ఫైనాన్స్ క్లియర్ చేసేందుకు కారులో బయలుదేరాను. కైలాసపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగారు. అప్పుడు బైకుపై ఇద్దరు వ్యక్తులు నన్ను ఫాలో అవుతున్నట్లు గుర్తించాను. ఇద్దరు కానిస్టేబుళ్లు నా దగ్గరకు వచ్చి కారు తాళాలు, పర్సు, కారులోని 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. మూడు విస్కీ సీసాలు పెట్టినట్లు గమనించాను. ఆ తర్వాత నన్ను లాఠీలతో కొట్టారు. ఇష్టమొచ్చినట్లు కాళ్లతో తన్నారు. ఆ తర్వాత నాలుగో పట్టణ స్టేషన్కు తీసుకెళ్లారు. తర్వాత కేజీహెచ్కు తరలించారు. నేను ఎక్యూట్ స్ట్రెస్ సైకోసిస్తో బాధపడుతున్నట్లు చెప్పారు’’ అని సుధాకర్ తన వాగ్మూలంలో పేర్కొన్నారు.