iDreamPost
android-app
ios-app

తూర్పు జెడ్పీ పీఠంపై ‘వేణు’గానం

  • Published Sep 23, 2021 | 9:54 AM Updated Updated Sep 23, 2021 | 9:54 AM
తూర్పు జెడ్పీ పీఠంపై ‘వేణు’గానం

జిల్లా రాజకీయాల్లో కీలకమైన జిల్లా పరిషత్‌ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. రాష్ట్రంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌కు చైర్మన్‌ అవడం ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా జెడ్పీ చైర్మన్‌గా చేసిన వారు తరువాత కాలంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంత్రులు, స్పీకర్లు అవుతారనే సెంటిమెంట్‌ కూడా ఉండడంతో ఈ పదవి ఎవరిని వరించబోతున్నది అన్నది జిల్లానే కాదు.. రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైన విషయం.

అటువంటి తూర్పు జెడ్పీ చైర్మన్‌ పదవి ఈసారి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ అయ్యింది. దీనితో ఈ అభ్యర్థిత్వంపై ఆసక్తి ఉంది. కాని రిజర్వేషన్‌ ఖారారు అయిన నాటి నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు విప్పర్తి వేణుగోపాలరావుదే. పార్టీ అధిష్టానం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతుండడంతో ఈ ఎంపిక లాంఛనం కానుంది.

వేణుగోపాల్‌ ఇరిగేషన్‌ శాఖలో ఇంజనీరుగా పలు కీలక విభాగాల్లో పనిచేశారు. ఎస్‌.సీ ప్రాభల్యం అధికంగా ఉన్న కోనసీమకు చెందినవారు కావడం, పి.గన్నవరం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయడం ఆయనకు కలిసి వచ్చే అంశం. గత 2014 ముందు ఈ నియోజకవర్గాని కో ఆర్డినేటర్‌గా పనిచేశారు. అసెంబ్లీ టిక్కెట్‌ వచ్చి చివరి నిమషంలో చేజారిన్నప్పటికీ పార్టీపైన, ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్ రెడ్డి పై విధేయతతో ఆయన 2014, 2019 ఎన్నికల్లో చురుగ్గా పని చేశారు. ఇవన్నీ ఆయనకు కలిసొచ్చాయి.

Also Read : కడియం ఎంపీపీ జనసేనదేనంటున్న పవన్‌.. కానీ అక్కడ జరుగుతుందేమిటి..?

పార్టీలో ప్రస్తుతం ఆయన జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా ఉన్నారు. వీటికితోడు ఇదే సామాజికవర్గం నుంచి మరో బలమైన వ్యక్తి లేకపోవడంతో వేణుగోపాలరావుకు ప్రత్యామ్నాయంగా లేదు. తూర్పున మొత్తం 62 జెడ్పీటీసీలు ఉండగా, 61 స్థానాలకు ఎన్నికలు జరగగా, వైఎస్సార్‌సీపీకి 59 స్థానాలు వచ్చాయి. దీనితో 25వ తేదీన జరిగే జడ్పీ చైర్మన్‌ పీఠం వైఎస్సార్‌సీపీ దక్కించుకోవడం లాంఛనమే.

‘విప్పర్తి’ ప్రస్థానం ఇది..

గోదావరి ఊగ్రరూపం దాల్చి వరదలా పొంగి గ్రామాల మీద వచ్చిపడుతుంటే సామాన్యులు ఎవరైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తారు. అటువంటి ప్రమాదకర సమయంలో కూడా విప్పర్తి వేణుగోపాలరావు మాత్రం కర్తవ్యాన్ని వీడలేదు. ప్రాణాలను ఫణంగా పెట్టి కరకట్టల (ఏటిగట్ల) రక్షణకు పరుగులు తీసేవారు. నాడు ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించినప్పుడైనా… నేడు పదవీ విరమణ చేసిన తరువాత అయినా అదే నిబ్ధత కొనసాగించారు. వరదలు వస్తే ఇప్పటికీ అధికారయంత్రాంగానికి సూచనలు, సలహాలు ఇస్తూనే ఉంటారు.

ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ల్లో జూనియర్‌ ఇంజనీరుగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం అదే సర్కిల్‌కు సూపరింటెండెంట్‌ ఇంజనీరు (ఎస్‌ఈ` ఫుల్‌ ఆడిషనల్‌ చార్జి (ఎఫ్‌ఏసీ) వరకు సాగింది. సర్వీసులో ఆరు నెలల కాలం మినహా మిగిలిన కాలమంతా ఆయన ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ల్లోనే పనిచేశారు. అందుకే జిల్లాలో వేణుగోపాల్‌ అంటే తేలియని రైతులు, ప్రజాప్రతినిధులు లేరంటే అతిశయోక్తి కాదు.

Also Read : పోల‘వర’మే.. డెల్టాకు ఎడారి అంటూ తప్పుడు ప్రచారం 

వేణుగోపాలరావు 31 ఏళ్ల పాటు ఇంజినీరుగా వివిధ హోదాల్లో పనిచేశారు. 1987 నుంచి 92 వరకు పోలవరం ప్రాజెక్టు ఏఈగా, వశిష్ఠ సబ్‌ డివిజన్‌, క్వాలిటీ కంట్రోల్‌ (కొయ్యిలగూడెం), పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో డీఈఈగా బాధ్యతలు నిర్వహించారు. ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ల్లో కీలకమైన హెడ్‌వర్క్సు ఈఈగా పనిచేయడమే కాకుండా డ్రైన్స్‌ (కాకినాడ), సెంట్రల్‌ డెల్టా, తూర్పు డెల్టా, పోలవరం ప్రాజెక్టుల పరిధిలో ఈఈగా పనిచేశారు. నిజంగా ఇదొక అరుదైన ఘనత. ధవళేశ్వరం సర్కిల్‌ల్లో కీలకమైన రెగ్యులర్‌, హెడ్‌వర్క్సు, డ్రెయిన్స్‌ విభాగాల్లో ఈఈగా పనిచేయడం విశేషం. 2010లో ఫుల్‌ ఆడిషనల్‌ చార్జి (ఎఫ్‌ఏసీ) ఎస్‌ఈగా పనిచేశారు.

1986 గోదావరికి రికార్డు స్థాయిలో వరదలు వచ్చిన సమయంలో ఆయన బ్యారేజ్‌ జేఈగా ఉన్నారు. 2006లో 29 లక్షల క్యూసెక్కుల వరద నీరు పొంగినప్పుడు రాజోలులో వశిష్ఠ సబ్‌ డివిజన్‌ డీఈఈగా పనిచేశారు. ఈ రెండు వరదలు ఎదుర్కొన్న అనుభవం వల్ల 2008-09లలో దివంగత నేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో గోదావరి వరద నియంత్రణ అభివృద్ధి పనులను ఈఈగా సమర్ధవంతంగా నిర్వహించారు. రూ.548 కోట్లతో ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి ఏటిగట్లను పటిష్టం చేయడం, రూ.112 కోట్లతో గోదావరి నదీ కోత నివారణకు చేపట్టిన గ్రోయిన్లు, రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణ పనులను సమర్ధవంతంగా చేసి ఉన్నతాధికారుల చేత శహభాష్‌ అనిపించుకున్నారు. అందుకే విప్పర్తిని ఆయన సహచర ఉద్యోగులు, రైతులు ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ వీకిపీడియా అని చెప్పుకుంటారు.

Also Read : పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు.. జడ్పీ పీఠాలు అధిరోహించబోయేది వీరేనా..?