iDreamPost
android-app
ios-app

హైదారాబాద్ ఫ్లైఓవర్ ప్రమాదంపై సీన్ రీ కనస్ట్రక్షన్ లో విస్తుపోయే వాస్తవాలు

హైదారాబాద్ ఫ్లైఓవర్ ప్రమాదంపై సీన్ రీ కనస్ట్రక్షన్ లో విస్తుపోయే వాస్తవాలు

హైదరాబాద్ లో తాజాగా జరిగిన బయోడైవర్సిటీ వంతెన ప్రమాదంలో కొత్త కోణం వెలుగుచూసింది. వంతెన నిర్మాణానికి తగినంత భూ సమీకరణ చేయకుండా రాజీపడి సేకరించిన స్థలంలోనే వంతెనను నిర్మాణం చేపట్టడం వల్లే మలుపులు ఏర్పడ్డాయని.. ఇప్పుడు ఆ మలుపుల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రమాదం తీరుపై నిపుణుల కమిటీ సోమవారం సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ వంతెన లోటుపాట్లపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో ప్రపంచబ్యాంకు రోడ్డు సేఫ్టీ విభాగం సలహాదారు ప్రొఫెసర్‌ నాగభూషణ రావు, డాక్టర్‌ టీఎస్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ కుమార్‌, ప్రదీప్‌రెడ్డి ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు సోమవారం నివేదికను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌కు సమర్పించారు. అలాగే ఈ నివేదికను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. వంతెనను ఇండియన్‌ రోడ్డు కూడలికి తగ్గట్టుగా నిర్మించినా వేగంగా వెళ్లే వాహనదారులకు ఇది ఏమాత్రం సురక్షితం కాదని నిపుణుల కమిటీ వెల్లడించింది. ముందుగా నిర్ణయించినట్లు ఈ వంతెనపై వాహనాలు గంటకు 40 కి.మీ. వేగంతో ప్రయాణించడానికి వీలుగా వేగ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటుచేయాలని సూచించింది.

నివేదికలోని ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి:

  • ఎస్సార్డీపీ కింద కూడలిలో నిర్మించిన రోడ్డు ఉపరితలానికి 16 మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్లై ఓవర్ నవంబరు 4న అందుబాటులోకి వచ్చింది.
  • ఈ ఫ్లైఓవర్ పై ఖాజాగూడ కూడలి నుంచి వన్ వేలో మైండ్‌స్పేస్‌ కు వాహనాలు వెళ్తుంటాయి. నవంబరు 9న ఓ కారు వంతెన పై ఫొటోలు తీసుకుంటున్న ఇద్దరు యువకులను ఢీకొట్టిన ఘటనలో వారిద్దరూ మరణించారు.
  • మళ్లీ నవంబరు 23న రెండో ప్రమాదం చోటుచేసుకుంది. 104 కిమీ వేగంతో దూసుకొచ్చిన పోలో రేసు కారు మలుపువద్ద వంతెన ప్రహరీని ఢీ కొట్టి కింద రోడ్డు మీదకు పల్టీ కొట్టింది. ఈఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా కారు నడిపిన వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. ఈ దుర్ఘటనతో వంతెన డిజైన్‌లో ఏమైనా లోపాలున్నాయా అనే సందేహంతో జీహెచ్‌ఎంసీ నిపుణులతో కమిటీ వేసింది.
  • పలుమార్లు వంతెనను క్షేత్రస్థాయిలో తనిఖీచేసి పైవంతెనపై జరిగిన ప్రమాదాన్ని సభ్యులు పరిశీలించారు.
  • ఇన్నోవా కారులో సీన్ రీ కనస్ట్రక్షన్ కు పూర్తి రక్షణ చర్యలతో వంతెనపై ఒకసారి 60 కి.మీ వేగంతో, మరోసారి 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లి ప్రమాదానికి కారణాలను అన్వేషించారు. వంతెన ఆకృతి, నాణ్యత, ఇతర అంశాలను పరిశీలించి నివేదిక ఇచ్చారు.
  • ప్రారంభించిన 20 రోజుల్లోనే రెండు రోడ్డు ప్రమాదాలకు దారితీసిన ఈ వంతెన విషయంలో ఇంజినీర్లు మరింత దూరదృష్టితో వ్యవహరించి ఉంటే బావుండేదని నిపుణులు కమిటీ అభిప్రాయపడింది
  • వంతెన ఆకృతి, కట్టడం నాణ్యత, ఇండియన్‌ రోడ్డు కూడలి అన్నీ ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని.. కానీ ఇంజినీర్లు నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టడంపైనే దృష్టి పెట్టారు తప్ప రెండు ప్రాణాంతకమైన మలుపులతో తక్కువ పొడవున్న పైవంతెన ఎలాంటి దుష్పరిణామాలకు తావిస్తుందనే కోణంలో చర్యలు తీసుకోలేకపోయారని నిపుణుల కమిటీ అంచనా వేసింది.
  • వంతెన ప్రారంభం నుంచి మలుపులవరకు వేర్వేరుచోట్ల, వేర్వేరు ఎత్తుల్లో వేగాన్ని తగ్గించేందుకు రంబుల్‌ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేయాలని, సెల్ఫీలు తీసుకోకుండా మలుపు దగ్గర ప్రహరీపై 1.5మీటర్ల ఎత్తులో పరదావంటివి ఏర్పాటు చేయాలని సూచించింది.
  • కమిటీ సూచించిన చర్యలు పూర్తయ్యాక మరోసారి వంతెనను పరిశీలించి బల్దియా, ట్రాఫిక్‌ పోలీసులతో సమావేశమై ఈ వంతెనను తిరిగి ప్రారంభించడంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

మొత్తంగా వంతెన పొడవు 990 మీటర్లు… ఇంత తక్కువ పొడవున్న వంతెనలో ఎస్‌ ఆకారంలో రెండు చోట్ల ప్రమాదకరంగా మలుపు తిరిగి ఉంది. ప్రమాణాల ప్రకారమే ఉన్నా అలాంటి ఆకృతి వాహనదారులకు ఏమాత్రం శ్రేయస్కరం కాదట.. భూసేకరణకు వెనకాడకుండా ఉంటే వంపులు తగ్గి రోడ్డు ఇంకాస్త నిదానంగా ఉండేదని అప్పుడు ప్రమాదశాతం తగ్గేదని నిపుణుల నివేదిక స్పష్టంచేసింది. ముఖ్యంగా వేగ పరిమితిని గంటకు 40 కి.మీ.కు పరిమితం చేయాలని సూచించింది.