వరదల వల్ల ఇసుక కొరత నెలకొందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అబద్దమని ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం అయన కృష్ణా జిల్లా టిడిపి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సిపి నేతల ఇసుక దోపిడీ సీఎం జగన్ కు కనపడడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి ఇసుక హైద్రాబాద్, బెంగుళూరు నగరాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇసుక పాలసీ మార్చకుండా ఉంటే ఐదుగురు కూలీలు ఆత్మ హత్యలు చేసుకునే వారు కాదన్నారు.
ఇరిగేషన్ లో జగన్ కు ఓనమాలు కూడా రావని చెప్పానని, ఇప్పుడు తానూ చెప్పిందే ఇరిగేషన్ లో జగన్ పాటిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో రైతు రుణ మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. టీడీపీ నేతల పై కేసులు పెడుతున్నారని, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.