అనారోగ్యంతో ఉన్న తనను జైలు నుంచి ప్రైవేటు ఆస్పతికి తరలించాలని ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన అచ్చెం నాయుడు పిటిషన్పై ఎల్లుండు బుధవారం తీర్పు వెలువరిస్తామని రాష్ట్ర హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్పై శుక్రవారమే వాదనలు పూర్తవగా అచ్చెం నాయుడు ఆరోగ్యంపై ప్రభుత్వం ఇచ్చే నివేదిక కోసం తీర్పు రిజర్వ్లో పెట్టింది. ఈ రోజు ప్రభుత్వం తరఫున న్యాయవాది అచ్చెం నాయుడు పిటిషన్పై నివేదిక అందించారు. దీంతో ఈ పిటిషన్పై బుధవారం తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది.
అచ్చెం నాయుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అచ్చెం నాయుడుకు సహయకుడు అవసరం ఉందని కూడా చెప్పారు. మూత్రశాలకు వెళ్లేందుకు వెరొకరి సహాయం కావాల్సి ఉంటోందన్నారు. కడుపులో అల్సర్ కణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అదే సమయంలో ప్రభుత్వం తరఫున న్యాయవాది ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కోర్టుకు విన్నవించారు. ఫైల్స్ కూడా తగ్గాయని చెప్పినట్లు సమాచారం. అందుచేత ఆయనకు వైద్యం అవసరం లేదని వాదించారు.
కాగా, ఈ పిటిషన్పై తీర్పు వెలువరించాల్సి ఉండగా.. ఈ రోజు అచ్చెం నాయుడు తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కస్టడీ కూడా ముగిసిన నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన తన పిటిషన్లో కోరారు. బుధవారం ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్పై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అచ్చెం నాయుడు తరఫు న్యాయవాది వాదనను కోర్టు మన్నిస్తుందా..? లేదా ప్రభుత్వ న్యాయవాది వాదనను సమర్థిస్తుందా..? వేచి చూడాలి.