iDreamPost
android-app
ios-app

ఆంధ్రా కాంగ్రెస్ కు ఈ క‌ష్టాలు ఇంకెన్నేళ్లో..!

ఆంధ్రా కాంగ్రెస్ కు ఈ క‌ష్టాలు ఇంకెన్నేళ్లో..!

ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు కుడితిలో ప‌డ్డ ఎల‌క‌లా కొట్టుకుంటోంది. నాయ‌కులు లేని నావ‌లా వెల‌వెల‌బోతోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ త‌ప్ప మ‌రో నాయ‌కుడి మాట అక్క‌డ వినిపించ‌డం లేదు. పార్టీతో సంబంధం లేకుండా సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి దూరంగా ఉంటున్న చిరంజీవిని ప‌ట్టుకుని వేలాడుతుండ‌డాన్ని బ‌ట్టే ఆ పార్టీ ప‌రిస్థితి అర్థం అవుతుంది.

కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ విజయవాడలో నిర్వహిచింన సమీక్షలో కూడా సీనియ‌ర్ల పై కామెంట్లు చేశారు. పార్టీ బాగున్నపుడు అన్ని విధాలా అధికారాలను అనుభవించిన సీనియర్ నేతలు ఇపుడు అడ్రస్ లేకుండా పోయార‌ని వ్యాఖ్యానించారు. అందుకు కార‌ణం మ‌రో రెండు ఎన్నిక‌లైనా కాంగ్రెస్ ఏపీలో ఒక్క‌సీట‌యినా సాధిస్తుంద‌నే గ్యారెంటీ లేక‌పోవ‌డ‌మే.

ఒక‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎంతో మోజు. ఆ పార్టీ సీటు కోసం పోటీ ప‌డేవారు. బ‌డా నేత‌ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసేవారు. రాష్ట్ర విభ‌జ‌న ఆ పార్టీకి శాపంగా మారింది. ఏడేళ్లుగా ఆ పార్టీని దేఖేవారే లేరు. ఎన్ని క‌మిటీలు వేసినా, ఎందరు అధ్యక్షులను మార్చినా ఏపిలో కాంగ్రెస్ పార్టీ పరిస్దితిలో మాత్రం మార్పు రావటంలేదు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ విజయవాడలో నిర్వహించిన స‌మీక్ష సంద‌ర్భంగా కూడా ఈ విషయం స్పష్టంగా బయటపడింది. 2014లో రాష్ట్రాన్ని విభజించే సమయానికి అప్పటికి పదేళ్ళ అధికారంతో కాంగ్రెస్ పార్టీ కళకళలాడుతోంది. రాష్ట్రాన్ని విభజించాలని తెలంగాణా ప్రాంతంలో ఉద్యమం జరుగుతోంది. ఇదే సమయంలో విభజన వద్దని రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సీమాంధ్ర ప్రాంతంలో కూడా ఉద్యమం జరిగింది.

అయితే మెజారిటి నేతలను కాదని మెజారిటి జనాల సెంటిమెంటును లెక్క చేయకుండా అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. తీసుకున్న నిర్ణయం కూడా అడ్డుగోలుగా ప్రస్తుత ఏపికి అన్నీ విధాలుగా నష్టం చేసే విధంగా తీసుకుంది. ఆస్తులను ఆదాయాన్ని రాజధాని హైదరాబాద్ ను తెలంగాణాకు ఇచ్చేసింది. అప్పులను లోటు బడ్జెట్ ను ప్రస్తుత ఏపికి ఇచ్చేస్తు విభజన చేసేసింది. దాంతోనే జనాలు కాంగ్రెస్ పార్టీకి ఘోరీ కట్టేశారు. పార్టీ ఉత్ధానంపై తీవ్రంగా మండిపడ్డారు. దాని ఫలితమే కాంగ్రెస్ పార్టీ ఇఫుడు శాపగ్రస్త అయిపోయింది.

2014 2019 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ, ఎంపీ సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు. పార్టీ నేతల అంచనా ప్రకారం మరో రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు ఒక్కసీటు కూడా వచ్చే అవకాశం లేదు. పార్టీ బాగున్నపుడు అన్నీ విధాల అధికారాలను అనుభవించిన సీనియర్ నేతలు ఇపుడు అడ్రస్ కూడా కనబడటం లేదు. ఇప్ప‌ట్లో భ‌విష్య‌త్ లేని పార్టీలో చేర‌డం, కొన‌సాగ‌డం వృథా ప్ర‌యాసే అని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చోటా మోటా నాయ‌కుల‌ను బ‌తిమ‌లాడుతూ, భ‌విష్య‌త్ లో ప‌ద‌వుల‌ను ఆశ చూపుతూ రాష్ట్రంలో పార్టీ ఇంకా ఉంద‌నిపించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎన్నేళ్లు ఇలాంటి దుస్థితి ఉంటుందో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి.