బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన భారత క్రికెట్ జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో ఘోర ఓటమి ఎదురైనా, జట్టులో ప్రధాన ఆటగాళ్లు దూరమైనా, సగం జట్టు గాయాలపాలయినా యువ ఆటగాళ్లతో నిండిన టీం ఇండియా అద్భుతమే చేసింది. 2-1 తో టెస్టు సిరీస్ గెలిచి అద్భుతమే చేసింది.
ముఖ్యంగా మొదటి,రెండు టెస్టుల అనుభవంతో ఆడుతున్నా యువ ఆటగాళ్లు చేసిన పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇదే సిరీస్ లో భారత టెస్టు జట్టులో అరంగేట్రం చేసిన మహ్మద్ సిరాజ్, నటరాజన్, శార్దూల్ ఠాకూర్, శుభ్మన్ గిల్, నవ్దీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్లు యువ భారత జట్టుకు ఉన్న తెగువ,గెలిచి తీరాలన్న పట్టుదల ఎలాంటిదో ప్రపంచానికి చూపించారు. ఈ ఆరుగురు ఆటగాళ్లకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ దిగ్గజం ఆనంద్ మహీంద్రా సర్ప్రైజ్ గిఫ్ట్స్ను ప్రకటించారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన యువ ఆటగాళ్లకు థార్ ఎస్యూవీలను బహుమతిగా ఇస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఆరుగురు క్రీడాకారులు జీవితంలో అన్ని రంగాల్లో ప్రేరణగా నిలుస్తారని అందుకే వారికి తన సొంత ఖర్చుతో థార్ ఎస్యూవీలను బహూకరిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా తెలిపారు.. ఈ బహుమతులకు కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు.