iDreamPost

ఎంపీ అసదుద్దీన్ డిమాండ్ సహేతుకం

ఎంపీ అసదుద్దీన్ డిమాండ్ సహేతుకం

దేశంలో గత నెల 25 నుంచి లాక్ డౌన్ అమల్లో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. ఈ రోజు వెయ్యి కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా సమావేశమైన నరేంద్ర మోడీ.. లాక్ డౌన్ పొడిగింపుపై ప్రకటన చేయడమే తరువాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓ డిమాండ్ చేశారు.

లాక్ డౌన్ విధింపు వల్ల వలస జీవుల బతుకులు చిన్నాభిన్నం అయ్యాయి. పొట్ట చేత పట్టుకొని సుదూర ప్రాంతాలకు, నగరాలకు వలస పోయిన పేదలు.. ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా విధించిన లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఉన్నచోట చేసేందుకు పని లేక, తినేందుకు తిండి లేక పస్తులతో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లేందుకు వందలాది కిలోమీటర్లు కాలినడకన బయలు దేరారు. మార్గమధ్యంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం లక్షలాది మంది వలస కూలీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు చేతనైనంత మేరకు సహాయం చేస్తున్నాయి. లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగించే నేపథ్యంలో వారందరూ మరిన్ని ఇబ్బందులు మరి పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ వలస జీవుల తరపున గళం విప్పారు.

లాక్ డౌన్ ను పొడిగించే ఆలోచన ఉంటే అంతకుముందే వలస కూలీల గురించి ఆలోచన చేయాలని ఎంపీ అసదుద్దీన్ డిమాండ్ చేశారు. వారికి ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. వలస కూలీల కు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేయాలని ఎంపీ అసదుద్దీన్ డిమాండ్ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి