iDreamPost

అదే నమ్మకం అదే ధీమా అదే విసురు …

అదే నమ్మకం అదే ధీమా అదే విసురు …

నేడు బిడ్డ వైఎస్ జగన్ నమ్మకం …

-> అక్క చెల్లెమ్మలూ… అమ్మఒడి సొమ్ము అందిందా!
-> అన్నా తమ్ముళ్లూ… రైతు భరోసా అందిందా!
-> అవ్వా తాతాలూ.. పెన్షన్ మీ ఇంటికే వచ్చిందా!

ఈ రోజు కర్నూల్ సభలో జగన్ గారు ప్రసంగించటానికి ముందుగా సభకు తరలివచ్చిన ప్రజల్ని ఉద్దేశించి తన సంక్షేమ పథకాల ఫలితాలు సక్రమంగా అందాయా అని తెలుసుకోవటానికి ఇలా ప్రశ్నించారు.

నాడు తండ్రి వైఎస్సార్ నమ్మకం ….

-> మీకేదైనా ప్రమాదం వాటిల్లగానే ఫోన్ చేస్తే కుయ్ కుయ్ కుయ్ మంటూ అంబులెన్స్ వస్తోందా
-> మీ ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చేస్తున్నారా .
-> మీకు ఖచ్చితంగా ఒకటో తారీఖుకి పెన్షన్ అందుతుందా .
-> ఇంజనీరింగ్ చదివే మీ బిడ్డలకు ఫీస్ రీ ఎంబర్స్మెంట్ టయానికి అందుతుందా .

2009 ఎన్నికల ముందు రాజశేఖర్ రెడ్డి గారు పలు సభల్లో ప్రసంగించేప్పుడు తన సంక్షేమ పథకాల ప్రతి ఫలాలు అందాయో లేదోనని ఇలా అడిగి వారినుండే సమాధానం పొందేవారు.

నేడు బిడ్డ వైఎస్ జగన్ ధీమా …

గత పదేళ్లుగా అస్తవ్యస్త విధానాలతో అన్ని రంగాల్లో వెనకబాటుకి గురైన స్థితి , అనేక సంక్షేమ , ఉచిత , మాఫీ పథకాలు ప్రకటించి ఐదేళ్లలో ఏ ఒక్కటీ అమలుపరచని బాబు నిర్వాకం కారణంగా మోసపోయి అధిక వడ్డీలతో అప్పుల పాలైన ప్రజలకు తక్షణ పరిష్కారంగా అనేక సంక్షేమ పథకాలతో విద్య , వైద్యం , ఉపాధి లాంటి పలు రంగాల్లో ఆసరా కల్పిస్తూ అనవసర ఆర్భాటాలకు పోకుండా అప్పులలో మునిగి ఉన్న ఖాజానా స్థితిని కూడా జాగ్రత్తగా మెరుగు పరుస్తూ ముందుకు సాగుతున్న జగన్ 

నాడు తండ్రి వైఎస్ఆర్ ధీమా ….

2004 లో వైఎస్ఆర్ అధికారంలో కొచ్చేనాటికి అంతులేని కరువు , ఉపాధి లేని స్థితి , వలసలు , ఖాళీ ఖజానా . అలాంటి స్థితి నుండి మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు నెరవేరుస్తూ , జలయజ్ఞం లాంటి బృహత్తర కార్యక్రమాన్ని నెత్తికెత్తుకొని ఆర్ధిక స్థితి అనుకూలించకున్నా , అనుభవజ్ఞుడు రోశయ్య వారిస్తున్నా మంచి కార్యక్రమానికి దేవుడే అండగా ఉంటాడు, మనం పని చేస్తూ పోతూ ఉంటే అన్నీ చక్కబడతాయి అని చెబుతూ ధీమాగా ముందుకు నడిచి చెప్పిన ప్రతి కార్యక్రమం చేసి చూపి ప్రజల దృష్టిలో మహానేతగా మిగిలిపోయారు .

నేడు బిడ్డ వైఎస్ జగన్ విసుర్లు …..

“అన్ని రోగాలకు ఆరోగ్యశ్రీలో చికిత్స ఉంది కానీ అసూయతో వచ్చే కడుపు మంటకు చికిత్స లేదు. కంటిచూపు తగ్గితే చికిత్స ఉంది కానీ కంటగింపుకు చికిత్స లేదు.” – కర్నూల్ సభలో జగన్

జగన్ అధికారం చేపట్టిన నాటి నుండీ ప్రతి పనిలోనూ వంకలు పెట్టి అభాసుపాలు చెయ్యాలని చూసే ప్రతిపక్షాలను ఏ మాత్రం పట్టించుకోకుండా పరిపాలనా వ్యవహారాలను చక్కబెట్టుకొంటూ సరైన సందర్భంలో ఒక్క సూటిమాటతో , లేదా తిరిగి సమాధానం చెప్పలేని ఒక వ్యంగ్యోక్తి విసిరి అంతటితో వదిలేసి తన పని తాను చేసుకుపోతున్నారు .

నాడు తండ్రి వైఎస్ఆర్ చెణుకులు …

చంద్రబాబు నువ్వు ఎలాంటి వాడివంటే
తల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట నీ బోటి వాడు .
ఏనాడైనా ఏ విషయంలోనైనా ఒక్క నిజం చెప్పావా బాబూ ,
నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందని బాబుకి ముని శాపం ఉన్నట్టుంది . అందుకే ఏ రోజూ నిజం చెప్పని అసత్యవాది బాబు .

తన పరిపాలనా కాలంలో బాబు పలు అసంబద్ధ ఆరోపణలు చేసిన సందర్భాల్లో కానీ , తాను ప్రతిపక్షంలో ఉన్న కాలంలో బాబు పలు విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా కానీ ఒక్క సూటి మాటతో , ఒక్క చెణుకుతో బాబు సహా మిగతా టీడీపీ నాయకులను అదుపు చేసేవారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు .

నాడు వైఎస్ ప్రసంగాలు చూసి నేటి కర్నూల్ సభ చూసిన వారెవరికైనా జగన్మోహన్ రెడ్డిలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తీరు కనపడుతుంది అనటంలో సందేహం లేదు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి