వన్డే వరల్డ్ కప్ వేటలో టీమిండియా జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. వరుసగా మూడు విజయాలతో మెగా టోర్నీలో పాయింట్ల టేబుల్లో టాప్ ప్లేస్కు చేరుకుంది. ఆస్ట్రేలియాతో పాటు పాకిస్థాన్ లాంటి బలమైన జట్లను ఓడించి మిగతా ప్రత్యర్థులకు బలమైన హెచ్చరికలు పంపింది రోహిత్ సేన. ఒకరకంగా ఆఫ్ఘానిస్థాన్పై భారత్ గెలుపును కూడా తీసిపారేయలేం. ఆ జట్టు టీమిండియాపై ఓటమి తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను ఓడించింది. స్వదేశంలో జరుగుతున్న మెగా టోర్నీలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తుండటంపై ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ స్పందించాడు. బలమైన జట్టుతో బరిలోకి దిగడం టీమిండియాకు బిగ్ ప్లస్గా మారిందన్నాడు.
ప్రపంచ కప్ స్వదేశంలో జరుగుతుండటం రోహిత్ సేనకు కలిసొస్తోందని రికీ పాంటింగ్ అన్నాడు. మెగా టోర్నీ ముందుకు సాగే కొద్దీ భారత జట్టుకు ఒత్తిడి తప్పదని.. దీన్ని ఎలా అధిగమిస్తుందనేది చాలా కీలకమని తెలిపాడు. ఒత్తిడి ఒక్కటే భారత్ను ఆపగలదన్నాడు. వరల్డ్ కప్ మొదలవ్వడానికి ముందు నుంచే తాను చెబుతున్నానని.. టీమిండియాను ఓడించడం చాలా కష్టమన్నాడు. అద్భుతమైన ప్లేయర్లతో బరిలోకి దిగి.. అన్ని విభాగాలను పటిష్టంగా మలచుకుందని పాంటింగ్ పేర్కొన్నాడు. పేస్, స్పిన్ బౌలింగ్ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదని.. భారత టాపార్డర్, మిడిలార్డర్ కూడా బలంగా ఉందన్నాడు. టీమిండియాను ఎదుర్కోవడం ఏ జట్టుకైనా కత్తిమీద సామేనన్నాడు.
‘వరల్డ్ కప్ ఎండింగ్ టైమ్కు ఉండే తీవ్ర ఒత్తిడిని తట్టుకుని అదే ఊపును భారత్ ఎలా కొనసాగిస్తుందో చూడాలి. స్ట్రెస్ను డీల్ చేయడమే ఆ టీమ్కు కీలకంగా మారనుంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న తీరును పరిశీలిస్తే అతడు చాలా బలంగా మారాడని అర్థమవుతోంది. బ్యాటింగ్లో అదరగొడుతూనే టీమ్ను ముందుండి నడిపిస్తున్నాడు. టోర్నీ ముందుకు సాగే కొద్దీ ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది. అయితే తొలుత స్ట్రెస్ను రోహిత్ తీసుకొని మిగతా వాళ్లూ దాన్ని ఎదుర్కొనేలా రెడీగా ఉంచుతాడు. రోహిత్ సూపర్బ్ కెప్టెన్సీ వల్ల విరాట్ కోహ్లీ లాంటి వాళ్లకు ఫుల్ ఫ్రీడమ్ లభిస్తోంది. తమ బ్యాటింగ్ మీదనే ఫోకస్ చేసేందుకు వారికి ఆస్కారం లభించినట్లైంది. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా విజేతగా నిలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి’ అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. మరి.. టీమిండియాపై పాంటింగ్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియాకు మరో ‘ఛేజ్ మాస్టర్’ దొరికాడా! అదరగొడుతున్న యంగ్ స్టర్..