iDreamPost

AP vs TS: నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత వాతావరణం.. AP వర్సెస్ తెలంగాణ పోలీసులు

  • Published Nov 30, 2023 | 11:03 AMUpdated Nov 30, 2023 | 1:06 PM

నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద బుధవారం అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు రాష్ట్రాల పోలీసులు పెద్ద సంఖ్యలో డ్యామ్ వద్దకు చేరుకున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..

నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద బుధవారం అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు రాష్ట్రాల పోలీసులు పెద్ద సంఖ్యలో డ్యామ్ వద్దకు చేరుకున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..

  • Published Nov 30, 2023 | 11:03 AMUpdated Nov 30, 2023 | 1:06 PM
AP vs TS: నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత వాతావరణం.. AP వర్సెస్ తెలంగాణ పోలీసులు

ఓవైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా డ్యామ్ వద్దకు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫెన్సింగ్ వేయడానికి వెళ్లిన ఏపీ ఇరిగేషన్ అధికారులకు సెక్యూరిటీ కల్పించడానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తెలంగాణ పోలీసులు దౌర్జన్యానికి దిగారు. వారిని అడ్డుకోవడమే కాక.. గేటు కూడా వేశారు. బుధవారం అర్థారాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని.. అక్కడ ఫెన్సింగ్ వేయడం కోసం ఇరిగేషన్ అధికారులతో కలిసి ఏపీ పోలీసులు వెళ్లారు.

అయితే వారు వెళ్లకుండా అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసులు గేటు వేశారు. తెరవమని ఏపీ పోలీసులు ఎంత శాంతియుతంగా చెప్పినా.. తెలంగాణ పోలీసులు వినలేదు. అంతేకాక ఏపీ వైపు ఉన్న గేటుకు సంబంధించిన సెన్సార్ ను కూడా పగలగొట్టారు. దాంతో ఏపీ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో.. ఆంధ్రా పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు. ఆ తర్వాత పోలీసుల సాయంతో.. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు సాగర్ డ్యామ్ మీద ఏపీ సరిహద్దుల్లోని తమ పరిధిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీని వల్ల బుధవారం అర్థరాత్రి సాగర్ డ్యామ్ మీద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

గతంలో కూడా ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఇలానే నీటి విషయంలో వివాదంరేగింది. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. అయితే తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం.. రాజకీయంగా దుమారం రేగింది. నాగార్జున సాగర్ డ్యామ్ కేంద్రంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్వేగాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఎప్పుడూ లేని విధంగా ఈ వివాదాన్ని పోలింగ్ సమయంలో తెరపైకి తెస్తున్నారని విమర్శించారు.

సాగర్ డ్యాం పై పోలీసుల డ్రామా ముఖ్యమంత్రి కేసీఆర్ పనేనని ఆరోపించారు కోమటిరెడ్డి. ఎన్నికల్లో ఓడిపోతామని కేసీఆర్ కు అర్థమైందని.. అందుకే తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారని మండి పడ్డారు. ఇన్ని రోజులు లేని హడావిడి పోలింగ్ రోజే ఎందుకు అవుతోందని ప్రశ్నించారు. తెలంగాణ, ఏపీ పోలీసులు కలిసి చేసే డ్రామాలను ప్రజలు ఎవరూ నమ్మొద్దన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎన్నికల కోసం వాడుతున్నారని.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సరే.. కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. 90 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రల విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన జనాలకు సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి