iDreamPost

వీఆర్​ఏల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే!

  • Author singhj Published - 07:30 PM, Thu - 10 August 23
  • Author singhj Published - 07:30 PM, Thu - 10 August 23
వీఆర్​ఏల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే!

వీఆర్​ఏల సర్దుబాటు ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది. ఇతర శాఖల్లో వీఆర్​ఏలను సర్దుబాటు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. సర్కారు ఇచ్చిన జీవోలకు ముందు ఉన్న స్థితినే కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తూ ఇతర శాఖల్లోకి బదిలీ చేయాలని రీసెంట్​గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్లుగా రెవెన్యూ శాఖ గత నెల 24న జీవో 81, ఆర్థిక శాఖ ఆగస్టు 3వ తేదీన జీవో 85 జారీ చేశాయి. వీఆర్​ఏలను ఇతర శాఖల్లోకి నియమిస్తూ ఈ నెల 3న సీసీఎల్​ఏ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.

సీసీఎల్​ఏ మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 61 ఏళ్లలోపు వయసున్న 16,758 మంది వీఆర్​ఏలను వారి విద్యార్హతలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో లోయర్ గ్రేడ్ సర్వీస్, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్మెంట్ వయసు దాటిన మరో 3,797 మంది వీఆర్​ఏల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. కానీ చట్టాలు, సర్వీసు రూల్స్​కు విరుద్ధంగా సర్దుబాటు ప్రక్రియ జరిగిందని, తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని కోరుతూ పలువురు వీఆర్​ఏలు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

వీఆర్​ఏల పిటిషన్​పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల వాదనతో ప్రాథమికంగా ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం.. జీవోలను సస్పెండ్ చేస్తూ జులై 24వ తేదీకి ముందు ఉన్న స్థితినే కొనసాగించాలని ఆదేశించింది. సీఎం కేసీఆర్​తో పాటు ఎన్నికల కమిషన్​ను ప్రతివాదుల జాబితాలో నుంచి తొలగించాలని పిటిషనర్లను ఆదేశించింది హైకోర్టు. ఈ పిటిషన్​పై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి