iDreamPost

ఆడుదాం ఆంధ్రా క్రికెట్‌ పోటీల్లో ఛాంపియన్‌గా ఏలూరు!

  • Published Feb 14, 2024 | 12:25 PMUpdated Feb 14, 2024 | 1:37 PM

Eluru, Adudam Andhra: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రికెట్‌ పోటీల్లో ఏలూరు జిల్లా జట్టు విజేతగా నిలిచింది. క్రికెట్‌తో పాటు మరో విభాగంలోనూ ఏలూరు ఫస్ట్‌ ప్లేస్‌ కొట్టింది. మరి ఈ విజేతలకు ఎంత ప్రైజ్‌మనీ అందించారో ఇప్పుడు చూద్దాం..

Eluru, Adudam Andhra: ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రికెట్‌ పోటీల్లో ఏలూరు జిల్లా జట్టు విజేతగా నిలిచింది. క్రికెట్‌తో పాటు మరో విభాగంలోనూ ఏలూరు ఫస్ట్‌ ప్లేస్‌ కొట్టింది. మరి ఈ విజేతలకు ఎంత ప్రైజ్‌మనీ అందించారో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 14, 2024 | 12:25 PMUpdated Feb 14, 2024 | 1:37 PM
ఆడుదాం ఆంధ్రా క్రికెట్‌ పోటీల్లో ఛాంపియన్‌గా ఏలూరు!

రాష్ట్ర యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో ఏలూరు విజేతగా నిలిచింది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో ఏలూరు జిల్లా జట్లు సత్తా చాటాయి. రాష్ట్రస్థాయిలో క్రికెట్‌, బాడ్మింటన్‌(షటిల్‌) పోటీల్లో విజేతగా నిలిచి ఏలూరు జిల్లా ఖ్యాతిని నిలబెట్టాయి. మంగళవారం వైజాగ్‌లోని బీవీఎంసీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన బ్యాడ్మింటన్‌ పోటీల్లో ఏలూరు-తిరుపతి జిల్లా జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఏలూరు జిల్లా ఆటగాళ్లు ఆదిరెడ్డి గుణశేఖర్‌, ఆరేరపు వంశీకృష్ణరాజు ప్రత్యర్థి జట్టును 17-20, 21-16, 17-21తో ఓడించారు. బ్యాడ్మింటన్‌ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన వంశీకృష్ణరాజును ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపిక చేసి.. రాష్ట్ర బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అతన్ని దత్తత తీసుకుని.. వంశీకి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి.. ప్రొఫెషనల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు సిద్ధం చేయనుంది.

బ్యాడ్మింటన్‌తో పాటు క్రికెట్‌లోనూ ఏలూరు జిల్లా టీమే ఛాంపియన్‌గా నిలవడం విశేషం. చాలా మంది ఆటగాళ్లు క్రికెట్‌ పోటీల్లో సత్తా చాటారు. మిగతా క్రీడా విభాగాల కంటే.. క్రికెట్‌పైనే ఎక్కువ ఆసక్తి చూపించారు. ఈ ప్రతిష్టాత్మకమైన పోటీల్లో ఏలూరు జట్టు ఫైనల్లో విశాఖ జిల్లా జట్టును ఓడించింది. వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఏలూరు-విశాఖ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విశాఖ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఇక లక్ష్యఛేదనకు దిగిన ఏలూరు జట్టు.. విశాఖ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ.. 15.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఆడుదాం ఆంధ్రా క్రికెట్‌ ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో.. ఫైనల్‌ చేరిన ఇరు జట్లకు షీల్డ్‌, కప్‌తో పాటు చెరో రూ.6 లక్షల నగదు బహుమతి అందించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి