iDreamPost

జ‌ర్న‌లిజానికి సినిమా క‌ష్టాలు

జ‌ర్న‌లిజానికి సినిమా క‌ష్టాలు

మూలిగే న‌క్క మీద తాటిపండు ప‌డిన‌ట్టు , తెలుగు జ‌ర్న‌లిజంపై క‌రోనా వ‌చ్చి ప‌డింది. ఉద్యోగాల తొల‌గింపు ప్రారంభ‌మైంది. ఆంధ్ర‌జ్యోతి, సాక్షి, ఈనాడు త‌ప్ప మిగ‌తా దిన‌ప‌త్రిక‌ల‌న్నీ వూరికే నామ్‌కే వాస్తే.

ఇచ్చే జీత‌మేదో క‌రెక్ట్‌గా ఇచ్చే ప‌త్రిక‌లు ఈ మూడే. లాక్‌డౌన్‌తో పత్రిక‌ల స‌ర్క్యులేష‌న్ త‌గ్గింది. యాడ్స్ అస‌ల్లేవు . సాక్షికి మాత్రం వార్షికోత్స‌వం యాడ్స్ వస్తున్నాయి. అందరూ పేజీలు అనివార్యంగా త‌గ్గించారు. దాంతో సిబ్బంది కోత‌పై దృష్టి పెట్టారు.

ఆంధ్ర‌జ్యోతిలో అన్ని విభాగాల్లో కోత ప్రారంభ‌మైంది. రాష్ట్ర వ్యాప్తంగా క‌నీసం వంద మంది స‌బ్ ఎడిట‌ర్ల‌ను తొల‌గించారు. స్టాఫ్ రిపోర్ట‌ర్లే కాకుండా ఇత‌ర ఉద్యోగుల జీతాల్లో కూడా కోత‌లుంటాయి. మిష‌న్ సెక్ష‌న్‌లో తొల‌గింపులు జ‌రుగుతున్నాయి.

ఈనాడులో ఇంకా ప్రారంభం కాలేదు. అరిచి గీపెట్టినా సెల‌వులు ఇవ్వ‌ని ఈనాడు యాజ‌మాన్యం, ఇప్పుడు ఉద్యోగుల్ని సెల‌వు మీద వెళ్ల‌మ‌ని చెబుతోంది.

ఫీల్డ్‌లో ఉన్న రిపోర్ట‌ర్ల‌కీ ఏ ఇబ్బందీ లేదు. వాళ్ల‌కొచ్చే లైన్ అకౌంట్ అంతంత మాత్ర‌మే కాబ‌ట్టి అది రాక‌పోయినా కొత్త‌గా వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదు. పైగా రిపోర్ట‌ర్లు లైన్ అకౌంట్ మీద ఆధార‌ప‌డ‌డం మానేసి చాలా కాల‌మైంది.
సాక్షిలో ఇంకా మొద‌లు కాలేదు. లాక్ డౌన్ మరింత కాల కొనసాగితే సాక్షి మీద కూడా ఒత్తిడి పెరగొచ్చు.

ఇక చాన‌ళ్ల‌లో స‌గానికి పైగా మూత‌ప‌డ‌తాయి. ఇప్ప‌టికే అవి క‌ష్టాల్లో ఉన్నాయి. పైగా ఎన్నిక‌ల‌కి నాలుగేళ్లు ఉంది కాబ‌ట్టి, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు కూడా ఏమీ లేవు. న‌డిచినంత కాలం న‌ష్టాలే.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌ర్న‌లిస్టుల‌కి ప్ర‌త్యామ్నాయం కూడా ఏమీ లేదు. వాళ్లు వృత్తిని మార్చుకుని కొత్త ఉపాధి వెతుక్కోవాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి