iDreamPost

విజృంభిస్తున్న కరోనా.. మళ్లీ లాక్‌డౌన్‌

విజృంభిస్తున్న కరోనా.. మళ్లీ లాక్‌డౌన్‌

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి.. మళ్లీ పెరుగుతున్నాయి. ఉత్తరాధి రాష్ట్రాలలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల ప్రతి రోజు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, నాగ్‌పూర్‌ వంటి ప్రధాన నగరాల్లో ప్రతి రోజు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదువుతున్నాయి.

కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాగ్‌పూర్‌ నగరంలో మరోమారు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్‌ దుకాణాలు, నిత్యవసరవస్తువలు దుకాణాలు మినహా మిగతా అన్ని దుకాణాలు మూతపడనున్నాయి. నాగ్‌పూర్‌లో ఒక్కరోజులోనే 1,715 కరోనా కేసులు నమోదు కావడంతో మహా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరు నెలల తర్వాత నాగ్‌పూర్‌లో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. నాగ్‌పూర్‌కు ముందే పలు పట్టణాలలో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. పూణే లో రాత్రిపూట లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు.

దేశంలో కరోనా కేసుల నమోదులో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. గత ఏడాది మహారాష్ట్రలో కరోనా వీరవిహారం చేసింది. కేసుల సంఖ్యతోపాటు మరణాలు అత్యధికంగా చోటుచేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా 1.13 కోట్ల మంది కరోనా బారిన పడగా.. అందులో ఒక్క మహారాష్ట్రలోనే 22.50 లక్షల మంది ఉన్నారు. దేశంలో కరోనా వల్ల 1.58 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో మహారాష్ట్ర వారే 52,610 మంది ఉన్నారు. మళ్లీ ఇప్పుడు మహారాష్ట్రలోనే కరోనా ప్రభావం పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలు కూడా తాజాగా పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమయ్యాయి.

Also Read : మరో దశకు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం

కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చినా.. అది సామాన్యప్రజలకు అందడం ప్రారంభమయ్యేందుకు మరో మూడునాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వంలోని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన వైద్య, పోలీసు, మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బందికి తొలి ప్రాధాన్యత కింద వ్యాక్సిన్‌ ఇచ్చారు. రెండో దశలో 50 ఏళ్లు పైబడి, దీర్ఘకాలిక అనారోగ్యసమస్యలు ఉన్నవారికి వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. ఇక చివరిదైన మూడో దశలో సామాన్య ప్రజలకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు మరికొంత కాలం స్వియ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి