iDreamPost

CM Revanth Reddy: విద్యుత్ శాఖపై సమీక్ష.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

  • Published Dec 09, 2023 | 9:03 AMUpdated Dec 09, 2023 | 9:03 AM

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. తొలి రోజు నుంచే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముందుగా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి.. కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. తొలి రోజు నుంచే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముందుగా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి.. కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు..

  • Published Dec 09, 2023 | 9:03 AMUpdated Dec 09, 2023 | 9:03 AM
CM Revanth Reddy: విద్యుత్ శాఖపై సమీక్ష.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7న తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరి కొందరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఇక తొలి రోజు నుంచే రేవంత్ రెడ్డి.. తన మార్కు పాలన మెుదలుపెట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అలానే ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ వస్తే.. కరెంట్ కష్టాలు తప్పవంటూ బీఆర్ఎస్ ప్రచారం చేసిన నేపథ్యంలో.. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే ఆ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఈ క్రమంలో శుక్రవారం కేబినెట్ భేటీ నిర్వహించిన రేవంత్.. ఆ తర్వాత వివిధశాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ముందుగా విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు రేవంత్. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా తెలంగాణలో కరెంటు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని ఈ సందర్భంగా సీఎం రేవంత్.. ఆ శాఖ అధికారులను ఆదేశించారు.  కేబినెట్ తొలి సమావేశంలోనే అనగా డిసెంబర్ 7నే విద్యుత్ రంగంపై జరిగిన చర్చకు కొనసాగింపుగా ఆ శాఖ అధికారులతో సచివాలయంలో శుక్రవారం (డిసెంబర్ 8న) ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ నిర్వహించారు రేవంత్.

telangana cm revanth reddy

విద్యుత్ శాఖకు సంబంధించిన అనేక అంశాలపై ఈ మీటింగ్‌లో చర్చించారు సీఎం రేవంత్. అధికారుల నుంచి వివరాలను అడిగి తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న విధానాలనే ఇకపైనా కొనసాగించాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకూడదని ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు. సమీక్ష సందర్భంగా ఛత్తీస్‌గఢ్ నుంచి కొంటున్న విద్యుత్‌ గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ప్రస్తుతం ఆ శాఖ ఆర్థిక పరిస్థితితో పాటు రానున్న రోజుల్లో సమకూర్చుకోవాల్సిన వనరులు, చేపట్టాల్సిన చర్యలపైనా అధికారులకు దిశా నిర్దేశం చేశారు సీఎం రేవంత్

రాష్ట్రమంతటా గృహ, పారిశ్రామిక, వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి ఆటంకాల్లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగాలన్నదే తమ ప్రభుత్వ విధానమని, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి శాఖ పూర్తిస్థాయిలో సమాయత్తమై సహకారం అందించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతిలో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. ముందుగా ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్.

సమావేశానికి హాజరు కానీ సీఎండీ..

ఇక ఈ సమావేశానికి ట్రాన్స్ కో – జెన్ కో సీఎండీ దేవుపల్లి ప్రభాకర్‌రావు హాజరుకావాల్సిందిగా క్యాబినెట్ భేటీ సందర్భంగానే విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేసినా.. ఆయన రివ్యూ మీటింగుకు హాజరు కాలేదు. అయితే దీనిపై ప్రభాకర్ రావు వాదన మరోలా ఉంది. తనకు సీఎంవో నుంచిగానీ, శాఖ అధికారుల నుంచిగానీ ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి లేదా ప్రభుత్వం నుంచి సమాచారం వస్తే హాజరుకాకుండా ఎందుకుంటాను అని ప్రశ్నించారు.. ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా హాజరుకావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మీడియా ప్రతినిధులతో అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి