iDreamPost

భీమవరంలో దారుణం.. 3 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలిక.. చివరకు

  • Published Sep 29, 2023 | 9:26 AMUpdated Sep 29, 2023 | 9:26 AM
  • Published Sep 29, 2023 | 9:26 AMUpdated Sep 29, 2023 | 9:26 AM
భీమవరంలో దారుణం.. 3 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలిక.. చివరకు

ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా సరే.. మహిళల మీద జరిగే అత్యచారాలు మాత్రం ఆగడం లేదు. కనీసం చిన్నారులు అని కూడా చూడకుండా.. పసి మొగ్గలను కూడా అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఓ దారుణం వెలుగు చూసింది. ఏడో తరగతి చదువుతున్న బాలిక హత్య స్థానికంగా కలకలం రేపింది. అయితే బాలిక సొంత బాబాయే చిన్నారిని హత్య చేసి ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాక బాలికపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక కుమార్తె కనిపించడం లేదని చిన్నారి తల్లిదండ్రులు.. పోలీసులను ఆశ్రయించారు. బాలిక కోసం గాలిస్తుండగా.. వారికి ఒక విషాదకర వార్త తెలిసింది. కనిపించకుండా పోయిన చిన్నారి వారి ఇంటి వెనుక ఉన్న తుప్పల్లోనే శవమై కనిపించింది. ఒక్కగానొక్క కుమార్తె.. ఇంత దారుణంగా హత్యకు గురికావడాన్ని బాలిక తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నబిడ్డ కోసం గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏం జరిగిందంటే..

భీమవరానికి చెందిన ములుపు అంజి, దుర్గ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె రత్నకుమారి(14). బాలిక.. పట్టణంలోని ఓ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ఒక్కగానొక్క బిడ్డ కావడంతో.. చిన్నారి తల్లిదండ్రులు.. కూలి పనులు చేసుకుంటూనే తమ బిడ్డను చదివించుకుంటున్నారు. చిన్నారి ఇంటివద్దనే బాలిక బాబాయి ములుపు మావుళ్లు నివసిస్తున్నాడు. కొన్ని రోజులుగా బాలికకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. స్కూల్‌కి వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటోంది.

ఈ నెల 26న రత్నకుమారి తల్లిదండ్రులు యథావిధిగా కూలి పనుల కోసం బయటకు వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చే సరికి వారికి కుమార్తె కనిపించలేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీసినా బాలిక జాడ తెలియలేదు. దాంతో కంగారుపడిన కుమారి తల్లిదండ్రులు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో బాలిక మిస్సింగ్‌ గురించి ఫిర్యాదు చేశారు.

బాబాయ్‌ మీద అనుమానంతో..

బాలిక తండ్రితో పాటు ఆమె బాబాయ్‌ మావుళ్లు కూడా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. పైగా తన మొబైల్‌ నుంచే దిశ పోలీసులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు కూడా చేశాడు. మావుళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా అతడి భార్య కువైట్‌లో ఉంది. అతని ఇద్దరు పిల్లలు నరసాపురంలోని హాస్టల్లో ఉంటున్నారు. ఇక బాలిక మిస్‌ అయిన నాటి నుంచి మావుళ్లు ప్రవర్తనలో తేడా రావడంతో.. కొందరు యువకులు అతడి మీద ప్రత్యేక నిఘా వేశారు.

ఇలా ఉండగా.. మావుళ్లు వేరొకరి ఇంటి నుంచి పార తేవడంతో వారి అనుమానం మరింత బలపడింది. మూడు రోజులుగా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో బాలిక తండ్రి అంజి మరికొంత మందితో కలసి గురువారం ఉదయం ఇంటి వెనుక తుప్పలు, జమ్ముతో ఉన్న ప్రాంతంలో వెతికేందుకు వెళుతుండగా.. అక్కడ ఉండదు.. అటు వెళ్లొద్దంటూ మావుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

అయినప్పటికీ బాలిక తండ్రి, మిగతా వారు వెళ్లి చూడగా అక్కడ వారికి చిన్నారి మృతదేహం కనిపించింది. అయితే బాలికను బాబాయే ఇంట్లో చంపేసి ఆ తర్వాత మృతదేహాన్ని తుప్పల్లో పడేసి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసుల విచారణలో నిజానిజాలు బయటకు రావాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని స్థానికులు భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి