iDreamPost

ముచ్చటగా మూడో ఆస్పత్రి : లోగుట్టు పెరుమాళ్లకెరుక

ముచ్చటగా మూడో ఆస్పత్రి : లోగుట్టు పెరుమాళ్లకెరుక

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ అయిన అనారోగ్య కారణాలు చూపుతూ 66 రోజులుగా ఆస్పత్రుల్లో ఉంటున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు వ్యవహారంలో మరో పరిణామం చోటుచేసుకుంది. గత నెల 8వ తేదీ నుంచి గుంటూరు రమేష్‌ ఆస్పత్రిలో జుడిషియల్‌ రిమాండ్‌లో ఉంటున్న అచ్చెం నాయుడుకు కరోనా సోకినట్లు ఆస్పత్రి వైద్యులు హైకోర్టుకు ఇటీవల నివేదించారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన హైకోర్టు.. అచ్చెం నాయుడును మంగళగిరి సమీపంలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.

మొత్తం 66 రోజులు అరెస్ట్‌లో అచ్చెం నాయుడు కేవలం 7 రోజులు మాత్రమే జైలులో ఉన్నారు. మొదట జూన్‌ 12వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ గుంటూరు సమగ్ర ఆస్పత్రిలోనూ, ఆ తర్వాత జూలై 8వ తేదీ వరకూ విజయవాడ సబ్‌ జైలులో, ఆ రోజు సాయంత్రం నుంచి ప్రస్తుతం వరకూ గుంటూరు రమేష్‌ ఆస్పత్రిలో ఉన్న అచ్చెం నాయుడు ముచ్చటగా మూడో ఆస్పత్రిలో ఉండబోతున్నారు. ఈ రోజు ఆయన్ను పోలీసులు ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించనున్నారని సమాచారం.

ప్రతి అంశంలో అలవిగాని డిమాండ్లు చేసే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అచ్చెం నాయుడు ఆరోగ్య విషయంలో మాత్రం ఏలాంటి ఆందోళన వెలిబుచ్చకుండా, డిమాండ్లు చేయకుండా మిన్నుకుండిపోతుండడం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. అచ్చెం నాయుడు ఫైల్స్ కు రెండో సారి గుంటూరు సమగ్ర ఆస్పత్రిలో ఆపరేషన్‌ జరిగి దాదాపు రెండు నెలలు కావస్తోంది. అయినా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది..? అనే అంశంపై చంద్రబాబు దృష్టి పెట్టలేదు. వైద్యులు వారానికి ఒకసారి హైకోర్టుకు వైద్య నివేదిక అందిస్తున్నా.. అది గోప్యంగానే ఉంటోంది.

ఈ క్రమంలో చంద్రబాబుతో సహా టీడీపీ శ్రేణులు, అచ్చెం నాయుడు అనుచరులు, అభిమానులు ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే సమాచారం తెలుసుకోలేకపోతున్నారనేది సామాన్యుల భావన.  పైగా ఆయన కరోనా బారిన పడ్డారు. అయిన ఇప్పుడు కూడా అచ్చెం నాయుడు ఆరోగ్యంపై తరచూ హల్త్‌ బులిటన్‌ విడుదల చేసి ప్రజలు, ఆయన అభిమానులు, అనుచరుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలనే డిమాండ్‌ చంద్రబాబు ఎందుకు చేయడంలేదన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్లుగా అచ్చెం నాయుడు ఫైల్స్‌ గుట్టు పెద్దలకు మాత్రమే తెలుసేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి