iDreamPost

ఒక్కరోజులో 6,654 పాజిటివ్ కేసుల నిర్దారణ

ఒక్కరోజులో 6,654 పాజిటివ్ కేసుల నిర్దారణ

దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. మొదట్లో వందల్లో నమోదైన కేసులు కాస్త నేడు రోజుకి దాదాపు ఐదు వేలకు తగ్గకుండా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఆరువేలకు పైగా పాజిటివ్ కేసులుగా నిర్దారణ అయ్యాయి. ఇప్పటివరకు నమోదయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికం. నిన్న ఒక్కరోజులో 6,654 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,101కి కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 3,720కి మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 137 మంది మరణించారు. కరోనా వైరస్ బారినుండి 51,783 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 69,597 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో 2940 పాజిటివ్ కేసులు నిర్దారణ

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు.గత కొద్దిరోజులుగా రోజుకు రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 2940 పాజిటివ్ కేసులు నమోదవడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతుంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 44582 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 73 మంది మహారాష్ట్రలో మృత్యువాతపడ్డారు. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 1517 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 27251 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. గడచిన 24 గంటల్లో 1751 కరోనా పాజిటివ్ కేసులు ముంబయిలో నమోదయ్యాయి. 27 మంది మృతి చెందారు. ముంబైలో కరోనా మరణాల సంఖ్య 909 గా నమోదయింది.

తెలంగాణలో నిన్న కొత్తగా  62 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 1761 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 670 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 1043 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 48 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 62 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 2667 కి మందికి కరోనా సోకగా 55 మంది మృత్యువాత పడ్డారు.1,731 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 881 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 5,306,199 మందికి కోవిడ్ 19 సోకగా 340,046 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 2,081,527 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,645,094 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 97,647 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి