బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదికను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. వికేంధ్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని శాస్త్రీయ ఆధారాలతో తుది నివేదికలో పొందుపరచి రాష్ట్రాన్ని ఆరు విభాగాలుగా విభజించి సమగ్రమైన నివేదిక అందించిందని అమర్నాథ్ తెలిపారు
శనివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అమర్నాథ్.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని గతంలోనే శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలు చెప్పాయన్నారు. ప్రపంచంలో అనేక గ్రీన్ ఫీల్డ్ నగరాలను బీసీజీ నివేదికలో పేర్కొన్నారని, రాజధానిపై లక్షా పదివేల కోట్ల పెట్టుబడి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కష్టమని బీసీజీ నివేదిక ద్వారా మరోమారు రుజువైందన్నారు
అయితే కొన్ని పత్రికల్లో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తున్నారంటూ విషప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అమర్నాథ్ మండిపడ్డారు. రాజధానుల అంశం పై గత కొన్నిరోజులుగా యల్లో పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక రాజధాని ఉంటే మరొక రాజధానిని అభివృద్ధి చేయకూడదా అని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ నగరం కోసం రాష్ట్రం విడిపోవడం ప్రత్యక్షంగా చూశాక కూడా అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం అయితే మళ్లీ విభజన వాదం తెరపైకి వస్తుందని అన్నారు. టీడీపీ ప్రాంతాల వారీగా ప్రజలను రెచ్చగొడుతుందని విమర్శించారు. అన్ని ప్రాంతాలకునీళ్లు, నిధులు, పరిపాలన సమానంగా అందించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని ఎమ్మెల్యే అమర్నాథ్ పేర్కొన్నారు.
ఒకపక్క పెద్ద పెద్ద భవనాల నిర్మాణానికి అమరావతి అనుకూలం కాదని నిపుణులు చెపుతున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని ఇక్కడ నిర్మించాలంటున్నారని, డబ్బంతా తీసుకువచ్చి అమరావతిలో ఖర్చు పెడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటని, ఖర్చు అంతా ఒకచోటే పెడితే పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించవద్దా? విశాఖలో స్టీల్ ప్లాంట్ కోసం వేలాది ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారు. తమ భూములకు రేట్లు తగ్గిపోతాయని చెప్పడం త్యాగమా? తమ వ్యాపారంను కాపాడుకోవడానికి చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరిని అమరావతికి తీసుకువచ్చారు. ప్రజలు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని భావిస్తున్నారు. అందుకే వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారు.
చంద్రబాబు ఫ్రస్టేషన్లో ఏమీ మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదు. అద్భుతమైన రాజధాని నిర్మిస్తే నారా లోకేష్ ఎందుకు రాజధానిలో ఓడిపోయాడు. జీఎన్రావు, బోస్టన్ గ్రూప్ చట్టబద్ధతని ప్రశ్నిస్తున్న చంద్రబాబు ముందు నారాయణ కమిటీకి ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పాలని, విశాఖలో రాజధానిని వ్యతిరేకిస్తున్న టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారు. చంద్రబాబు మాటలు విని అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అశోక్ గజపతి రాజు ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. అశోక్ గజపతి రాజుగా కాకుండా బంటుగా వ్యవహరిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధానిలో పర్యటించి రైతుల పక్షాన ఉంటానని డబ్బాడు పెరుగున్నం తిన్నారు. పెరుగన్నం అరగక ముందే హైదరాబాద్ వెళ్లి మాట మార్చారు. పవన్ పూటకో మాట మాట్లాడుతున్నారని, పవన్ ఊగడం మానేసి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.