iDreamPost

ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్ ఎప్పుడు ..?

ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్ ఎప్పుడు ..?

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నిక రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఏలూరు నగరపాలక సంస్థలో ఉన్న 50 డివిజన్లకు ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలతో సహా ఎన్నికలు నిర్వహించినప్పటికీ కౌంటింగ్ తేదీపై ఇంకా సందిగ్ధత వీడలేదు. ఏప్రిల్ ఒకటో తేదీన హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా కౌంటింగ్ తేదీ ఉండే అవకాశాలున్నాయి.

విలీనమే అసలు కారణం..

పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు మున్సిపాలిటీలతో పాటుగా ఒక నగరపాలక సంస్థ ఉంది. వీటిలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపాలిటీలతో పాటుగా ఏలూరు కార్పొరేషన్లో సమీప పంచాయతీలను విలీనం చేశారు. దీనిపై తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం స్పెషల్ ఆఫీసర్ల తీర్మాణాలతో విలీనం చేశారంటూ, అంతేకాకుండా శాస్త్రీయంగా ఓటర్ల జాబితా తయారు చేయలేదని, రిజర్వేషన్ ప్రక్రియ కూడా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా సక్రమంగా లేదని స్థానిక నేతలు కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

అయితే భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీల్లో ఎన్నికలను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏలూరులో మాత్రం యధావిధిగా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. దీన్ని సవాల్ చేస్తూ 48 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం మరో రెండు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి అనగా వాయిదా వేయాలంటూ తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ కొందరు కార్పొరేటర్ అభ్యర్థులు బెంచ్ డివిజన్ ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్నికలు యధావిధిగా నిర్వహించాలని, అయితే ఫలితాలు మాత్రం ఈ నెల 23 వతేదీన కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే వెల్లడించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ నెల 23న విచారణ జరగాల్సి ఉండగా ఆ రోజు అత్యధికంగా కేసులు ఉండడంతో 24వ తేదీకి వాయిదా వేశారు. బుధవారం విచారణ చేపట్టగా కొందరు ప్రతివాదులు ఇంకా సంబంధిత దస్త్రాలను సమర్పించే లేదని, దానివల్ల కొంత సమయం కావాలని ఏజే కోర్టును కోరారు. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చారు.

ఏలూరు కార్పొరేషన్ పరిధిలో 2లక్షల 32వేల 378 మంది ఓటర్లుంటే…అందులో లక్షా 32వేల 478 మంది మాత్రమే ఓటేశారు. మరోవైపు భారీగా ఓట్ల గల్లంతుకు అధికారుల వైఫల్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏలూరు కార్పొరేషన్‌లో కేవలం 56.82 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. విలీన గ్రామాల ప్రజలను 50 డివిజన్లలో సర్దుబాటు చేయటంలో అధికారయంత్రాంగం విఫలమైందంటున్నారు నేతలు.

అభ్యర్థుల్లో ఇంకా వీడని భయం..

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు భారీ ఎత్తున నగదు ఖర్చు చేశారు ఈ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నారు అయితే కోర్టు తీర్పు వాయిదా వేయడంతో వారిలో నిరాశ అలుముకుంది వచ్చేనెల ఒకటో తేదీన కోర్టు ఏం తీర్పు ఇస్తుందని భయం మాత్రం వారిని వీడలేదు.

Also Read : చేతులెత్తేసిన నిమ్మగడ్డ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి